లాక్‌డౌన్‌ : 200 కిమీ నడక.. ఆగిన కార్మికుడి ఊపిరి

29 Mar, 2020 13:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్‌కు కాలినడనడక బయలుదేరిన కార్మికుడు

గమ్యం చేరకముందే.. మృత్యువాత

భోపాల్‌ : కూటికోసం పొట్ట చేతపట్టుకుని దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన ఓ కార్మికుడు (39) లాక్‌డౌన్‌ కారణంగా మరణించాడు. ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్‌కు కాలిబాటన వెళ్తున్న ఓ వలస కార్మికుడు మార్గం మధ్యలోనే కన్నుమూశాడు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన​ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఎక్కడివారు అక్కడ చిక్కుకుపోయారు. ముఖ్యంగా ఉపాధి కోసం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లిన కార్మికుల పిరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విదేశాల్లో చిక్కుకున్న వారికి ప్రత్యేక విమానాలు పంపుతున్న భారత ప్రభుత్వం.. స్థానిక ప్రజలపై మాత్రం కనికరం చూపలేదు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్‌కు కాలి నడకన బయలుదేరిన ఓ కార్మికుడు ఆలసిపోయి మార్గం మధ్యంలో ఆగ్రా సమీపంలో  మృత్యువాత పడ్డాడు. (క్షమాపణలు కోరిన ప్రధాని మోదీ)

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన రణ్‌వీర్‌సింగ్‌ అనే కార్మికుడు ఉపాధికోసం ఢిల్లీకి వలసవెళ్లాడు. అక్కడ ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో డెలివరీ బాయ్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. రెస్టారెంట్‌ను మూసివేయక తప్పలేదు. దీంతో రోజగడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే తన స్వస్థలం మొరీయానాకు బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు. అయితే వాహనాలు లేకపోవడంతో శుక్రవారం కాలి నడకన బయలుదేరాడు. దాదాపు 200 కిలోమీటర్లు నడిసిన అనంతరం తీవ్రమైన ఛాతీ నొప్పితో కైలాష్‌ సమీపంలో జాతీయ రాజధాని 2పై కుప్పకూలాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు రణ్‌వీర్‌ను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసేలోనే ఆయన మృతి చెందాడు. చివరి నిమిషంలో ఆయన సోదరుడుతో మాట్లాడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. (లాక్‌డౌన్‌ ఉల్లంఘనులకు వినూత్న శిక్ష)

కాగా అతని ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందిం‍చామని, మృతుడిని స్వస్థలంకు పంపే ఏర్పాటు చేస్తున్నామని పోలీసు అధికారి సికిందర్‌ తెలిపారు. కాగా దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా చాలా చోట్ల కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒడిశా, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికులు పలు ప్రాంతాల్లో ఉండిపోయారు. నెత్తి మీద ఒక మూట, చంకలో పిల్ల, రెండు చేతుల నిండా పెద్ద పెద్ద బ్యాగుల్లో సామాన్లతో వలస కార్మికులు నడుస్తున్న దృశ్యాలు అన్నిచోట్లా కనిపిస్తున్నాయి. కొంతమంది కనీసం తిండిలేక అలమటిస్తున్నారు. మరికొందరు మాత్రం వందల కిలోమీటర్లు కుంటుంబంతో సహా నడుచుకుంటూ స్వస్థలాలకు చేరుతున్నారు. తెలంగాణలోనూ పలువురు కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారందరినీ ఆదుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. (వెల్లువలా వలసలు)

మరిన్ని వార్తలు