ఆర్థిక సంక్షోభానికి ఇవి సంకేతాలు కావా!?

4 Dec, 2019 14:33 IST|Sakshi

న్యూఢిల్లీ: రోజు రోజుకు దేశంలో జీఎస్టీ (వస్తువులు, సేవల పన్ను) వసూళ్లు గణనీయంగా పడిపోతున్నాయి. జీఎస్టీ లక్ష్యాలు ఏ మాత్రం అందుకోకపోగా ఏటేటా వసూళ్ల రెవెన్యూ పడిపోవడం ఆందోళనకరం. క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ‘ఇక్రా’ లెక్కల ప్రకారం 2018–2019 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో జీఎస్టీ వసూళ్లు 3.2 లక్షల కోట్ల రూపాయలుకాగా, 2019–20 ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ రెవెన్యూ 3.1 లక్షల కోట్టకు పడిపోయింది.

జీఎస్టీ వసూళ్లలో తమ వాటాలను ఇంత వరకు చెల్లించక పోవడం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, వెంటనే తమ వాటాలను చెల్లించాల్సిందిగా ఐదు రాష్ట్రాలు.. పశ్చిమ బెంగాల్, కేరళ, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్‌ ప్రభుత్వాలు గత వారమే కేంద్రానికి లేఖలు రాశాయి. జీఎస్టీ వసూళ్లను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తీసుకరావడంతో ఈ ఏడాది ఇప్పటి వరకు 22 మంది ఆదాయం పన్ను శాఖకు చెందిన 22 మంది ఉన్నతాధికారులు తమ పదవులకు రాజీనామాలు చేసి, స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకున్నారని, గతేడాది 34 మంది అధికారులు ఇలాగే రాజీనామా చేశారని ‘ఇన్‌కమ్‌ టాక్స్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌’ వెల్లడించింది.

వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా జీఎస్టీ వసూళ్ల లక్ష్యాలు అతి ఎక్కువగా ఉండడం వల్లన తాము లక్ష్యాలను సాధించలేకపోతున్నట్లు అసోసియేషన్‌ వెల్లడించింది. ఆదాయం పన్ను శాఖ అధికారుల ఒత్తిళ్లను తట్టుకోలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గత జూలై నెలలో నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ‘కఫే కాఫీ డే’ చైన్‌ అవుట్‌ లెట్ల వ్యవస్థాపకులుఉ వీజీ సిద్ధార్థ లేఖలో ఆరోపించడం ఇక్కడ గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2019–2020 ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ వసూళ్ల లక్ష్యంలో ఒక లక్ష కోట్ల రూపాయలను తగ్గించింది. అందుకు పరిహారం అన్నట్లుగా కేంద్రం ఆర్‌బీఐ రిజర్వ్‌ ఫండ్‌ నుంచి 1.76 లక్షల కోట్ల రూపాయలను తీసుకుంది.

జీడీపీ వృద్ధి రేటు గత ఏడెనిమిది ఏళ్లుగా ఎప్పుడు లేనంతగా గత త్రైమాసానికి 4.5 శాతానికి పడిపోయింది. నిరుద్యోగ సమస్య గత ఆరు దశాబ్దాల్లో ఎన్నడు లేనంతగా 8.5 శాతానికి పెరిగిపోయింది. దేశంలో నిరుద్యోగ సమస్య 2017–18లో 6.1 శాతానికి చేరుకోవడంతో గత 49 ఏళ్లలో ఎన్నడు లేనంత గరిష్ట స్థాయికి చేరుకుందంటూ జాతీయ మీడియా వార్తలు రాసిన విషయం తెల్సిందే. ఏది ఏమైనా జాతీయ ఆర్థిక ద్రవ్యోల్బణం నాలుగు శాతానికి మించనీయడం లేదని కేంద్రం చెబుతోందిగానీ అది కూడా ఇప్పటికే ఆర్థిక శాతాన్ని దాటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక ద్రవ్యోల్బణం 3.46 శాతంగా కేంద్రం పేర్కొనగా అది తప్పని, వాస్తవానికి అది 5.85 శాతం ఉందని కాగ్‌ (కేంద్ర కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) కేంద్రానికి మందగించడం ఇక్కడ గమనార్హం.

>
మరిన్ని వార్తలు