ఎడారిలో జలసిరి

11 Mar, 2017 01:54 IST|Sakshi
ఎడారిలో జలసిరి

రాజస్థాన్‌ కరువు ప్రాంతాల్లో పొంగుతున్న గంగ
తెలుగు ఇంజనీర్‌ శ్రీరాం వెదిరె సారథ్యంలో భగీరథ యజ్ఞం


ఏడాదిలోనే ఫలితాలిస్తున్న జల వనరుల అథారిటీ ప్రణాళిక
మోడు వారిన భూముల్లో రెండు, మూడు పంటల సాగు


గొంతు తడుపుకొనేందుకు చుక్క నీరు లేదు.. పది కిలోమీటర్లు వెళితే గానీ కడివెడు నీరు దొరకదు.. సాగుకు కనుచూపు మేరలో చెరువన్నదే కనపడదు.. ఊరి జనంలో 90 శాతం వలస పోయే పరిస్థితి.. ఇది రాజస్థాన్‌ ఎడారుల్లో గ్రామీణ ప్రాంతాల దుస్థితి. ఈ పరిస్థితిని మార్చి, గ్రామాలను హరిత వనాలుగా తీర్చిదిద్దేందుకు ఆరేళ్ల కింద ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. అందులో తెలుగు వ్యక్తి కీలకంగా పనిచేస్తున్నారు. ఆనాడు ఈ సంస్థ ప్రతినిధులు భూములను సర్వే చేస్తోంటే స్థానికులు రాళ్లతో తరిమారు. ఇప్పుడవే చేతులు పూలమాలలతో స్వాగతిస్తున్నాయి. ఎందుకు? ఈ ఐదేళ్లలో ఏం జరిగింది? జాతీయ మీడియా బృందంలో భాగంగా ‘సాక్షి’ ప్రతినిధి రాజస్థాన్‌లో జరుగుతున్న జలయజ్ఞంపై చేసిన పరిశీలనలో ఈ ప్రశ్నలకు జవాబు దొరికింది. చుక్క నీటి కోసం కటకటలాడిన చోట ఇప్పుడు పాతాళ గంగ పోటెత్తుతోంది. మోడువారిన భూములు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి.

(రాజస్థాన్‌ నుంచి లెంకల ప్రవీణ్‌ కుమార్‌)
రాజస్థాన్‌లో 2011లో ప్రతిపక్ష నేతగా ఉన్న వసుంధరరాజే.. మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని కరువు కోరల నుంచి గట్టెక్కించేందుకు గల అవకాశా లను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అప్పటికే అమె రికాలో 15 ఏళ్లు ఇంజనీర్‌గా పనిచేసి స్వదేశానికి తిరి గి వచ్చిన తెలుగు వ్యక్తి శ్రీరాం వెదిరెకు పలు రాష్ట్రా ల్లో నీటి వనరుల సంరక్షణపై పనిచేసిన అనుభవం ఉంది. దీంతో శ్రీరాం వెదిరెను ఢిల్లీకి పిలిపించిన వసుంధర.. రాజ స్థాన్‌లో నీటి ఎద్దడి ప్రాంతాలను సుభిక్షం చేసే పని చేపట్టాలని కోరారు. అప్పటికే లోకహిత స్వచ్ఛంద సంస్థతో అనుబంధమున్న శ్రీరాం.. సంస్థకు చెందిన ప్రతినిధులతో కలసి రాజస్థాన్‌కు వెళ్లారు.

కరువు ప్రాంతాల్లో నీటి వనరులను పెంచేందుకు సర్వే చేపట్టారు. కానీ స్థానికులు తమ భూములకేదో ప్రమాదం పొంచి ఉందని భావించి రాళ్లు విసురుతూ వారిని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అయినా ఆ బృందం నిరుత్సాహపడలేదు. సరేనన్న గ్రామాల్లో సర్వే చేసి ప్రణాళికలు సిద్ధం చేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక పనులు ప్రారంభించింది. వసుంధర రాజస్థాన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. శ్రీరాం వెదిరెకు కేబినెట్‌ ర్యాంకు హోదా ఇస్తూ ‘రాజస్థాన్‌ రివర్‌ బేసిన్, స్టేట్‌ వాటర్‌ రీసోర్సెస్‌ ప్లానింగ్‌ అథారిటీ’కి చైర్మన్‌ను చేశారు.

చతుర్విధ జలప్రక్రియతో జీవం..
రాజస్థాన్‌ ప్రభుత్వం శ్రీరాం సాయంతో చతుర్విధ జలప్రక్రియను ఎంచుకుంది. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని భూమాత దాహం తీరుస్తోంది. అదే నీరు పాతాళ గంగై పొంగేలా చేస్తోంది. రాజస్థాన్‌లో సగటు వార్షిక వర్షపాతం 564.89 మిల్లీమీటర్లు. కొన్ని ప్రాంతాల్లో 171 మి.మీ. ఉంటే కొన్ని ప్రాంతాల్లో 950 మి.మీ. వరకు ఉంటుంది. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీరు ఇంకేలా చేయడం, ఆ తేమ నిండిన భూమిపై నీరు నిలిచి చిన్న చిన్న ఊట చెరువులు, చెరువుల్లో నిల్వగా మారి.. తద్వారా ఆ నీటిని ప్రజలు వినియోగించుకోవడం ఈ చతుర్విధ జల ప్రక్రియలో అనుసరించే విధానం.

రివర్‌ బేసి న్‌లో ఉండే నీటి వనరులను అనుసంధానం చేసి చివరకు నదులను సజీవంగా చేసే ప్రక్రియ ఈ విధానంలో తుది దశ. వర్షపు నీరు భూమిలోకి ఇంకే లా స్టాగర్డ్‌ కందకాలు చేసి వాటిపై జట్రోఫా చెట్లను పెంచుతున్నారు. దిగువన చిన్న ఊట చెరువులు, ఆ దిగువన వాటర్‌ షెడ్లను, చెరువులను నిర్మిస్తున్నారు. చెరువుగా మారేందుకు అవకాశమున్న ప్రతి చోట పైన క్యాచ్‌మెంట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. గతేడాది జనవరిలో తొలి విడతగా జల స్వావలంబన అభియా న్‌ కింద 3,529 గ్రామాలను ఎంపిక చేసి ఐదారు నెల ల్లోనే పనులు పూర్తిచేశారు. ఇప్పుడు రెండో విడతలో మరో 4,250 గ్రామాల్లో పనులు చేస్తున్నారు.

తొలి ఏడాదే ఫలితాలు..
గతేడాదిలో ప్రారంభించి వర్షాకాలం నాటికి పనులు పూర్తయిన ప్రాంతాల్లో.. వర్షపు నీటితో చెరువులు నిం డాయి. వర్షాధారంగా శనగ సాగు చేసుకునే రైతులు ఇప్పుడు 2 నుంచి 3 పంటలు శనగ, గోధుమ సాగుచేస్తున్నారు. వచ్చే ఏడాది వేరుశనగ, మొక్కజొన్న పంటలను సాగుచే స్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంచి నీటి కొరత తీరింది. భూగర్భజలాలు పెరిగి చేతి పంపుల్లో నీరు లభ్యమవుతోంది. ఈ నీటి వనరులు పశువుల దప్పికను తీర్చుతున్నాయి. వలస బాట పట్టే ప్రజలు ఇప్పుడు తమ భూములను సాగులో పెడు తున్నారు. కోటి చెట్ల పెంపకం లక్ష్యంగా మొక్కలు నాటుతున్నారు. వాటిని ఐదేళ్ల పాటు పెంచే బాధ్యతను అటవీ శాఖకు అప్పగించారు.

మూడు అడుగుల లోతులోనే నీరు
బాన్సా్వరా జిల్లాలోని గోడీ తేజ్‌పూర్‌లో 2,500 హెక్టా ర్ల పరిధిలో ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతం వరకు నీరు ఇంకేందుకు గతేడాది విస్తృతంగా కందకాలు తవ్వారు. వాటి దిగువన ఊట చెరువులు నిర్మించారు. దాంతో ప్రస్తుతం ఎండా కాలంలోనూ అక్కడ నేలలో తేమ కనిపిస్తోంది. మూడు అడుగులు తవ్వగానే నీళ్లు కనిపిస్తున్నాయి. దీంతో సమీప ప్రాంతాల్లోనూ భూగర్భ జలాలు పెరగడం విశేషం.

నాణ్యత లోపిస్తే కఠిన నిర్ణయాలు
రాజస్థాన్‌లో వందల కోట్లతో చేపడుతున్న ఈ పనుల్లో ఎక్కడైనా శాస్త్రీయత లోపించిందని తేలితే ఆ పనులను రద్దు చేసి కాంట్రాక్టర్లతో మళ్లీ చేయిస్తు న్నారు. ఒక ఊట చెరువు కట్ట నిర్మించాలంటే దశల వారీగా నీళ్లు చల్లి కట్ట పటిష్టం చేస్తూ ఎత్తు పెంచాలి. కానీ అలా జరగలేదని తేలితే వాటిని రద్దు చేస్తున్నా రు. ఆ కట్టలను తొలగించి మళ్లీ నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నారు. తొలి, మలి దశల్లో ఇప్పటివరకు ఇలా దాదాపు 135 పనులను రద్దు చేశారు.

తెలుగు వారిది కీలకపాత్ర
ఈ పథకాన్ని నిర్విఘ్నంగా, యజ్ఞంగా కొనసాగిం చడంలో తెలుగు వాళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ ఉద్యో గులైన జక్కిడి జంగారెడ్డి, అఫ్సర్‌ సాంకేతిక నిపుణు లుగా ప్రత్యేక డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీరాం సన్నిహితుడైన ఇంజనీర్‌ రాకేష్‌రెడ్డి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వాసు తదితరులు తోడ్పాటు అందిస్తున్నారు.

ఏడాదిలో 12 టీఎంసీల నీరు: శ్రీరాం వెదిరె
చక్కటి ప్రణాళిక, పనుల్లో నాణ్యత, నిరంతర పర్యవేక్షణతోనే తమ లక్ష్యం సాధ్యమవుతోందని శ్రీరాం వెదిరె తెలిపారు. తమ పనులు విజయవంతమైన ప్రతి చోట పొరుగు గ్రామాల్లోని ప్రజలు ఇలాంటి పనులే కోరుకుంటున్నారని తెలిపారు. బాన్సా్వరా ప్రాంతంలోని కోరాపాడాలో నిర్మించిన చెరువును పరిశీలించేందుకు వెళ్లిన మీడియా బృందంతో ఆయన మాట్లాడారు. ‘‘ప్రజల భాగస్వామ్యంతో ఇదంతా జరుగుతోంది.  ఇప్పటివరకు ప్రజలు దాదాపు రూ. 55 కోట్ల విరాళాలను అందించారు. ఇప్పటివరకు 41 లక్షల మంది ప్రజలు, 45 లక్షల మూగజీవాలకు ఈ నీటి వనరుల ద్వారా ప్రయోజనం చేకూరింది. ఇప్పటివరకు అతి తక్కువ ఖర్చుతో దాదాపు 12 టీఎంసీల నీటిని వినియోగంలోకి తేగలిగాం. భూగర్భ జల మట్టాలు దారుణంగా పడిపోయి ఉన్న ప్రాంతాలు ఇప్పుడు జలసిరితో కళకళలాడుతున్నాయి. ఈ పనుల పూర్తి ఫలాలు అందడానికి మరో రెండు మూడేళ్లు పడుతుంది..’’అని పేర్కొన్నారు.

వేరు శనగ కూడా పండిస్తా
‘‘ఇంతకుముందు ఒకటే పంట పండేది. ఈ ఏడాది ఎకరం పావులో గోధుమ వేశా. ఈ చెరువుతో మా బతుకు మారుతోంది. వచ్చే ఏడాదిలో గోధుమతోపాటు వేరుశనగ, పత్తి పండిస్తా. కాలం కాస్త బాగున్నా మూడు పంటలు పండిస్తా..’’    
– రావోజీ, రైతు, కోరాపాడా

శనగ, గోధుమ పండిస్తున్నా
గ్రామంలో నిర్మించిన చెరువు  ఆశలు చిగురింపజేసింది. గతంలో ఇక్కడ నీళ్లే కని పించేవి కాదు. ఇప్పుడు రెండు మూడు పంటలు పండిస్తు న్నాం. గతంలో వర్షాధా రంతో కేవలం ఒక పంట పండేది. గ్రామంలో 90 శాతం ప్రజలు వలస వెళ్లేవారు.    
– కమ్జి, రైతు, కోరాపాడా

నీటి కమిటీలు పనిచేస్తున్నాయి
‘‘రాజస్థాన్‌ ప్రభుత్వం కేవలం చెరువులు నిర్మించడమే కాకుండా నీటి వనరులకు గ్రా మస్తులతో కమిటీలు వేస్తోంది. సాగు చేసుకునే వారు నీటిని పొందుతారు. ఇతరత్రా ఉపా ధి లేనివారు చేపలు పట్టుకునేందుకు ఈ కమిటీలు వీలు కల్పిస్తాయి..’’ 
– జక్కిడి జంగారెడ్డి, సాంకేతిక నిపుణుడు

స్వయం సమృద్ధి లక్ష్యంగా..
‘గ్రామీణ ప్రాంతాలు స్వయం సమృద్ధి సాధించే దిశగా జల స్వావలంబన అభియాన్‌ పనిచేస్తోంది. గ్రామీణులు ఈ పథకంతో మమేకం అవుతున్నారు. రెండు మూడేళ్లలో పల్లెలన్నీ హరితరూపు దాల్చుతాయి..’
– ధన్‌సింగ్‌ రావత్, రాజస్థాన్‌ గ్రామీణాభివృద్ధి మంత్రి

మరిన్ని వార్తలు