వెయ్యిమంది గాంధీలు వచ్చినా ఇండియా క్లీన్‌ కాదు : మోదీ

2 Oct, 2017 14:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వెయ్యిమంది మహాత్మాగాంధీలు వచ్చినా స్వచ్ఛభారత్‌ లక్ష్యం సాధ్యం కాదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అలాగే లక్షమంది నరేంద్రమోదీలు, దేశంలోని ముఖ్యమంత్రులు అంతా ఏకమైనా ఇది అసాధ్యం అని.. కానీ, ఎప్పుడైతే ప్రజలంతా ఏకమవుతారో, 125 కోట్లమంది భారతీయ ప్రజలు అనుకుని ముందుకు సాగుతారో అప్పుడు మాత్రమే ఈ లక్ష్యం సాధ్యం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. స్వచ్ఛభారత్‌ ప్రారంభమై మూడో ఏడాది పూర్తవడంతోపాటు నేడు గాంధీ జయంతి  కావడంతో ప్రధాని మోదీ మాట్లాడారు.

భారత్‌ ఎప్పుడో స్వయం పాలనకు వచ్చినప్పటికీ సాధించాల్సినది చాలా ఉందని అన్నారు. వాటన్నింటికంటే ముందు స్వచ్ఛ భారత్‌ను సాధించడం ముఖ్యం అని అన్నారు. పౌరసమాజంలోని సభ్యులు, మీడియాది స్వచ్ఛ భారత్‌ను విజయవంతం చేయడంలో కీలక పాత్ర అని చెప్పారు. ఒక శక్తిమంతమైన దేశంగా రూపుదిద్దుకునే ముందు పరిశుభ్రతతో కూడిన దేశంగా మారడం ముఖ్యం అని గుర్తు చేశారు. 'మోదీని విమర్శించడానికి చాలా విషయాలు మీకున్నాయి. కొంతమంది అలా విమర్శించడానికి మీకు వెయ్యి అంశాలు అందిస్తారు. .. అయితే, అలా విమర్శించేవారు దయచేసి పరిశుభ్రతను పాటించేవారిని మాత్రం అధైర్యపరచకండి' అంటూ మోదీ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు