రివ్యూ పిటిషన్‌పై నేడు నిర్ణయం : వక్ఫ్‌ బోర్డు లాయర్

17 Nov, 2019 13:00 IST|Sakshi

లక్నో: అయోధ్య రామాలయం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేసే విషయంలో నేడు నిర్ణయం తీసుకోనున్నట్టు సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు లాయర్‌ జఫర్యాబ్‌ జిలానీ తెలిపారు. ఇందుకోసం ఆదివారం ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సభ్యులు, బాబ్రీ మసీదు యాక్షన్‌ కమిటీ, మత పెద్దలు, అయోధ్య కేసులో ముస్లిం పక్షాలతో లక్నోలోని నద్వా కళాశాలలో సమావేశం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

జిలానీ ఇంకా మాట్లాడుతూ.. ‘మాకు ఐదెకరాలు ఇవ్వాలని సుప్రీ ఇచ్చిన తీర్పుపై మాకు అసంతృప్తి ఉంది. నా వ్యక్తిగత అభిప్రాయమైతే ఐదెకరాలు కాదు. 500 ఎకరాలు ఇచ్చినా సమ్మతం​ కాదు. మాకు మసీదే కావాలని వ్యాఖ్యానించిన ఎమ్‌ఐఎమ్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీతో నేను ఏకీభవిస్తా’నని వెల్లడించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ జుఫర్‌ ఫారూఖీ సుప్రీం తీర్పును స్వాగతించారు కదా అని ప్రశ్నించగా, ఆయన చెప్పేదే ఫైనల్‌ కాదు. అతనిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించామని తెలిపారు. ఇదిలా ఉండగా, అయోధ్య కేసులో తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ ఆదివారం పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు