'సీఎం మమ్మల్ని కలవాల్సిందే'

5 Aug, 2016 20:26 IST|Sakshi
'సీఎం మమ్మల్ని కలవాల్సిందే'

లక్నో: తమను ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కలవాల్సిందేనని బులంద్ షహర్ లో లైంగిక దాడికి గురైన బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఆయన కలిస్తేనే తమ కేసు విచారణ సత్వరంగా పూర్తవుతుందని అన్నారు. తామేం రాజకీయాలు చేయడం లేదని, కేవలం న్యాయం కోసమే పోరాడుతున్నామని చెప్పారు. గతవారం బులంద్ షహర్ లో ఓ తల్లి కూతుళ్లపై కొందరు దుండగులు సామూహిక లైంగిక దాడి చేయగా ఆ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఈ కేసు దర్యాప్తును మూడు నెలల్లో పూర్తి చేయకుంటే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం ఆ కుటుంబానికి మూడు లక్షల నష్ట పరిహారం, ఘజియాబాద్ లో రెండు ప్లాట్లు కూడా ఇచ్చారు. అయితే ప్రస్తుతం కేసు విచారణ జరుగుతున్న తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆ కుటుంబం తమను సీఎం అఖిలేశ్ కలవాల్సిందేనని డిమాండ్ చేశారు.

సీబీఐ దర్యాప్తు చేయించేందుకు సీఎం అఖిలేశ్ ఒప్పుకున్నారని తాము పత్రికల్లో చదివామని, దాంతోపాటు తాము రాజకీయాలకు పాల్పడుతున్నట్లు మరికొన్నిట్లో చదివామని, అయితే, తామేం రాజకీయాలు చేయడంలేదని, న్యాయం కోసం ప్రాధేయపడుతున్నామని వాపోయారు. ఇప్పటికే ఈ ఘటన జరిగి ఏడురోజులు గడుస్తున్నా ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు