మందిర్‌ తీర్పులో జాప్యం సహించం..

5 Jul, 2018 19:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈ సంవత్సరాంతానికి రామ మందిర నిర్మాణం ప్రారంభమయ్యేలా రామ జన్మభూమి వివాదంపై విచారణను వేగవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అలోక్‌ కుమార్‌ సుప్రీం కోర్టును అభ్యర్థించారు. అయోధ్య కేసును త్వరితగతిన విచారించాలని ఈ కేసులో వీహెచ్‌పీ గెలుపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై సర్వోన్నత న్యాయస్ధానం నిర్ణయం వెలువడితే ఈ ఏడాది చివరిలో మందిర నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు.

ఇక బాబ్రీ విధ్వంసం కేసుకు, మందిర్‌ నిర్మాణానికి సంబంధం లేదని చెప్పారు. ఒకటి క్రిమినల్‌ కేసు కాగా, మరొకటి భూ యాజమాన్య హక్కులకు సంబంధించినదన్నారు. అయోధ్య వివాదానికి సంబంధించి కోర్టు తీర్పులో జాప్యం జరిగితే హిందూ సన్యాసులు, ప్రముఖుల సూచనలతో ముందుకు వెళతామని, అవసరమైతే ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.

కాగా, వీహెచ్‌పీని మతపరమైన ఉగ్రవాద సంస్థగా సీఐఏ పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ అమెరికన్‌ ఏజెన్సీ చర్యపై తాము ఆందోన చెందడం లేదని, ఈ అంశాన్ని భారత ప్రభుత్వం అమెరికా దృష్టికి తీసుకువెళ్లాలని తాము కోరుతున్నామన్నారు.
 

మరిన్ని వార్తలు