కరోనా వైద్య పరీక్షల్లో తేలిందేమిటి?

30 May, 2020 15:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావానికి సంబంధించి భారత్‌లో వైద్య పరీక్షలు నిర్వహిస్తోన్న తీరుపై ఓ పరిశోధనా బృందం శుక్రవారం భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) ఓ నివేదిక సమర్పించింది. జనవరి 22వ తేదీ నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు మొత్తం 10,21,518 మందిపై పరీక్షలు నిర్వహించగా, వారిలో 40,184 మందికి కరోనా ఉన్నట్లు తేలిందని, అంటే పాజిటివ్‌ కేసుల శాతం 3.9 శాతం ఉందని శాస్త్రవేత్తలు నివేదికలో పేర్కొన్నారు. (ఒక్క రోజే 7,964 కరోనా కేసులు)

విదేశీయానం చేసి వచ్చిన వారిని, వారితో సంబంధం ఉన్న వారిని, నిర్ధారిత కేసులతో సంబంధం ఉన్న వారిని, కరోనా లక్షణాలున్న వారిని, కరోనా రోగులకు వైద్య చికిత్సలు అందించిన వైద్య సిబ్బందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు శాస్త్రవేత్తల బృందం నివేదికలో తెలిపింది. కరోనా కేసులతో సంబంధం ఉన్న వారికి పరీక్షలు జరపగా వారిలో 25.3 శాతం మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని, కరోనా రోగులతో సంబంధం లేకుండా శ్వాస సంబంధిత సమస్యలున్న వారికి పరీక్షలు నిర్వహించగా వారిలో 14 శాతం మందికి కరోనా నిర్ధారణ అయిందని నివేదిక వెల్లడించింది.

కరోనా లక్షణాలు కలిగిన వైద్య సిబ్బందిలో 2.4 శాతం మందికి, కరోనా లక్షణాలులేని వైద్య సిబ్బందికి  పరీక్షలు నిర్వహించగా, వారిలో 2.8 శాతం మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే హాట్‌ జోన్లలో 3 శాతం కరోనా కేసులు నిర్ధారణ అయినట్లు నివేదిక తెలిపింది. కరోనా లక్షణాలు లేని వంద మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో ఐదుగురికి, కరోనా లక్షణాలున్న వారికి పరీక్షలు జరపగా వారిలో పది మందికి కరోనా సోకినట్లు శాస్త్రవేత్తల విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. (అలర్ట్‌ : ఆ రాష్ట్రాలపై కరోనా పంజా)

మరిన్ని వార్తలు