ప్రశ్నాపత్రంలో కేంద్ర మంత్రి ‘డార్విన్‌’ వ్యాఖ్యలు..

24 Feb, 2018 16:34 IST|Sakshi
ఫైల్‌ఫోటో

సాక్షి, పూణే : డార్విన్‌ జీవ పరిణామ సిద్ధాంతాన్ని కేంద్ర మంత్రి సత్యపాల్‌ సింగ్‌ విమర్శించడంలో తప్పేముందని ఐఐఎస్‌ఈఆర్‌ పరీక్షల్లో విద్యార్ధులకు ప్రశ్న ఎదురైంది. విద్యార్థుల తార్కిక ఆలోచనా విధానాన్ని పరిశీలించేందుకే ఈ ప్రశ్నను ప్రశ్నాపత్రంలో జోడించామని సంస్థ డీన్‌ వివరణ ఇచ్చారు. కేంద్ర మంత్రి వాదన ఎందుకు సరైంది కాదో వివరించాలని ప్రశ్నలో విద్యార్థులను కోరామని..ఈ ప్రశ్న మంత్రి ప్రకటనపై కాదని, దాని వెనుక ఉన్న తర్కంపైనే ప్రశ్నించామని ఐఐఎస్‌ఈఆర్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ డీన్‌ సంజీవ్‌ గలాండె తెలిపారు.

ఐఐఎస్‌ఈఆర్‌లో తర్కబద్ధంగానే బోధన, సాధన ఉంటుందని చెప్పుకొచ్చారు. మంత్రి వ్యాఖ్యలపై తాము చర్చను చేపట్టలేదని..విద్యార్ధులు తర్కబద్ధంగా వాదించేలా..విభిన్నంగా జవాబులు ఇచ్చేలా ప్రశ్నలు ఉంటాయని అన్నారు. డార్విన్‌ పరిణామ సిద్ధాంతం శాస్ర్తీయంగా తప్పు అని..ఇది స్కూల్‌, కాలేజ్‌ బోధనాంశాల్లో ఉండరాదని గత నెలలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సింగ్‌ పేర్కొన్నారు. అయితే దీనిపై శాస్త్రవేత్తల నుంచి వ్యతిరేకత ఎదురైనా ఆయన తన వైఖరికి కట్టుబడ్డారు.

డార్విన్‌ సిద్ధాంతం సరైంది కాదు...భూమిపై కనిపిస్తున్న మనిషి ఎప్పటికీ మానవుడిగానే ఉన్నాడని..పాఠ్యాంశాల్లో చెబుతున్నట్టు మన పూర్వీకులు ఎవరూ వానరం నుంచి నరుడిగా మారలేదని మంత్రి చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 

మరిన్ని వార్తలు