వాట్సాప్‌లో ఇక గ్రూప్‌ కాలింగ్‌

1 Aug, 2018 04:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్‌ వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఒక వ్యక్తికి మాత్రమే వాయిస్‌ కాల్, వీడియో కాల్‌ చేసుకునే సౌలభ్యం ఉండేది. తాజాగా ఎక్కువ మందితో సంభాషణలు జరిపేందుకు ‘గ్రూప్‌ కాల్‌’సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఎక్కువ మందికి ఒకేసారి వీడియో, వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను మంగళవారం నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ ఓ బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది. ఇప్పటికే ఐఫోన్, ఆండ్రాయిడ్‌ వెర్షన్లలో ఇది అందుబాటులో ఉందంది. వాట్సాప్‌లో కుడి వైపు పైభాగంలో కనిపించే ‘యాడ్‌ పార్టిసిపెంట్‌’అనే ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా కాలింగ్‌లో సభ్యులను ఆహ్వానించవచ్చని పేర్కొంది. ఒక వ్యక్తి గరిష్టంగా నలుగురు వ్యక్తులతో సంభాషించవచ్చంది. వాట్సాప్‌ను 130 కోట్ల మంది ఉపయోగిస్తుండగా.. ఇందులో రోజుకు దాదాపు 200 కోట్ల నిమిషాలను కాల్స్‌ కోసం వెచ్చించారని వెల్లడించింది.  

మరిన్ని వార్తలు