తమిళనాయుడికి రూ.3,249 కోట్లా?

12 Nov, 2015 20:57 IST|Sakshi

న్యూఢిల్లీ:  కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన ప్రెస్ నోట్‌లో ఘోరమైన తప్పు దొర్లింది.  దక్షిణాది రాష్ట్రం  తమిళనాడు పేరును తమిళనాయుడు  అని పట్టణాభివృద్ధి శాఖ అధికారులు  పేర్కొన్నారు.  సంబంధిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గురువారం అధికారికంగా విడుదల చేసిన ప్రెస్  స్టేట్‌మెంట్‌లో ఇలా  తమిళనాయుడు అని  రెండు సార్లు పేర్కొనడం వివాదాన్ని రేపింది.  

సీనియర్ బీజేపీ నేత వెంకయ్య నాయుడు సారధ్యం వహిస్తున్న మంత్రిత్వ శాఖ అధికారిక  ప్రకటనలో ఈ పొరపాటు చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వ అటల్ మిషన్  ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్)  ప్రాజెక్టు కింద తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి 3,249  కోట్ల రూపాయల సిఫారసు చేస్తూ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు జారీ చేసిన నోట్ ఇది.  దీంతో  తమిళనాడు కాస్తా తమిళనాయుడు ఎప్పుడయ్యిందబ్బా అని జనాలు తలలు పట్టుకుంటున్నారట.

మరిన్ని వార్తలు