రజనీ, కమల్‌ ప్రకటించిన సాయం ఎక్కడ?

23 Mar, 2018 07:56 IST|Sakshi
రజనీకాంత్, కమలహాసన్‌

సాక్షి, చెన్నై : పాఠశాల విపత్తులో బలైన విద్యార్థులకు నటుడు రజనీకాంత్, కమలహాసన్‌ అందిస్తానన్న ఆర్థికసాయం ఏమైందనే ప్రశ్న తెలెత్తుతోంది.వివరాలు.. 2004, జూన్‌ 16న తంజావూరు జిల్లా, కుంభకోణంలోని ఒక ప్రైవేట్‌ పాఠశాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 94 మంది పిల్ల లు ఆహుతులయ్యారు. 18 మంది పిల్లలు తీవ్ర గాయాలపాలయ్యారు. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం, కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, కరుణానిధి, జయలలిత ప్రమాద స్థలానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించి, తగిన ఆర్థికసాయాన్ని అందించారు. రాష్ట్రప్రభుత్వం మృతి చెందిన వారి కుటుంబాలకు  తలా రూ.లక్ష పరిహారంగా అందించింది. అదే విధంగా నటుడు రజనీకాంత్, కమలహాసన్‌ కూడా మరణించిన వారి కుటుంబాలకు సాయాన్ని అందించనున్నట్లు వెల్లడించారు. అయితే సంఘటన జరిగి 14 ఏళ్లు అయినా రజనీ, కమల్‌ ప్రకటించిన ఆర్థికసాయాన్ని అందించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు కమల్, రజనీ రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారని, ఇప్పుటికైనా వారు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలనే అభిప్రాయం బాధిత కుటుంబాల నుంచి వ్యక్తం అవుతోంది.

ఈ వ్యవహారంపై అగ్నిప్రమాదంలో తన కుమారుడిని కోల్పోయిన మహేశ్‌ అనే వ్యక్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ నటుడు రజనీ, కమల్‌ తమ వాగ్దానాలను నెరవేర్చలేదు కదా, అప్పటి నడిగర్‌సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్‌ బాధిత కుటుంబాలకు రూ.60 లక్షల విరాళాలను సేకరించినట్లు, ఆ మొత్తానికి మరో రూ.40 లక్షలు కలిపి కోటి రూపాయలను అందించనున్నట్లు చెప్పారని, ఆ మొత్తం కూడా బాధిత కుటుంబాలకు అందలేదని అన్నారు. అయితే ఆదే ప్రమాదంలో కొడుకును బిడ్డను కోల్పోయిన ఇన్బరాజ్‌ అనే వ్యక్తి ఇప్పుడు రజనీకాంత్‌ ఏర్పాటు చేయనున్న పార్టీలో నిర్వాహకుడిగా నియమితులయ్యాడు. ఆయన తెతుపుతూ రజనీకాంత్, కమలహాసన్‌ బాధిత కుటుంబాలకు అందిస్తానన్న సాయాన్ని అప్పుడే నడిగర్‌ సంఘంకు అందించారని వారు తెలిపారని, ఆ మొత్తాన్ని అప్పటి సంఘ నిర్వాహకులు ఏం చేశారో, అసలు ఏం జరిగిందో తెలియలేదని అన్నారు.  

మరిన్ని వార్తలు