ఎవరీ విక్రమ్ అభినందన్‌?

27 Feb, 2019 17:47 IST|Sakshi
సహచరులతో విక్రమ్‌ అభినందన్‌ (బాణం గుర్తు)

సాక్షి, చెన్నై: భారత పైలట్‌ విక్రమ్ అభినందన్ తమకు పట్టుబడినట్టు పాకిస్థాన్‌ ప్రకటించింది. భారత యుద్ధ విమానం మిగ్‌-21 తమ భూభాగంలో కూలినప్పుడు పారాచ్యూట్‌ సహాయంతో కిందకు దూకిన ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించింది. అభినందన్‌ గల్లంతైన విషయాన్ని భారత విదేశాంగ ధ్రువీకరించింది. అయితే ఆయన పేరును వెల్లడించలేదు. (పాకిస్తాన్‌ యుద్ధ విమానాన్ని కూల్చేశాం : భారత్‌)

అభినందన్‌ స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరుపణవూరు. చెన్నైలోని తాంబరంలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో ఆయన కుటుంబం నివసిస్తోంది. ఆయన తండ్రి కూడా ఎయిర్‌ మార్షల్‌గా పనిచేశారు. ఉడుమలైపేటలోని సైనిక్ స్కూల్‌లో అభినందన్ విద్యాభ్యాసం సాగింది. దేశంపైకి దండెత్తిన శత్రు విమానాలను వెంటాడుతూ దాయాది దేశానికి పట్టుబడ్డ ఆయన చిత్రహింసలు ఎదుర్కొంటున్నారు.

దౌత్యపరం‍గా పాకిస్థాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చి అభినందన్‌ను విడిపించుకోవాలన్న ఆలోచనలో భారత్‌ ఉంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని పాకిస్థాన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ సయిద్‌ హైదర్‌ను పిలిపించుకుని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరసన వ్యక్తం చేసింది. (భారత పైలట్‌కు పాక్‌ చిత్రహింసలు!)

క్షేమంగా విడిచిపెట్టాలి: అభినందన్‌ మేనమామ
అభినందన్‌ను క్షేమంగా విడిచిపెట్టాలని ఆయన మేనమామ గుంగనాధన్ విజ్ఞప్తి చేశారు. మేనల్లుడిని తన చేతులతో పెంచానని.. టీవీల్లో వస్తున్న ఫొటోలు, వీడియోలు అభినందన్‌వేనని తెలిపారు. అభినందన్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వీరు ఢిల్లీలో ఉంటున్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు