ఉల్లి షాక్‌ నుంచి ఉపశమనం..

9 Dec, 2019 18:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భగ్గుమంటున్న ఉల్లి ధరలతో సామాన్యుడు బెంబేలెత్తుతుంటే వీటి ధరలు క్రమంగా దిగివస్తాయనే సంకేతాలు వెల్లడవుతున్నాయి. ఉల్లి సరఫరాలు మెరుగవడంతో పాటు ఆప్ఘనిస్తాన్‌, టర్కీల నుంచి దిగుమతవుతున్న ఉల్లితో ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ హోల్‌సేల్‌ మార్కెట్‌లో గత వారం కిలో ఉల్లి రూ 65 నుంచి 80 వరకూ పలుకగా, ఈ వారం రూ 50-75కే పరిమితమైంది. రాజధానిలోని దేశంలోనే అతిపెద్దదైన కూరగాయల మార్కెట్‌ ఆజాద్‌పూర్‌ మండీకి దేశీ ఉల్లితో పాటు 200 టన్నుల దిగుమతులు చేరుకోవడంతో ధరలు స్వల్పంగా దిగివచ్చాయి.

గత రెండు రోజులుగా 80 ట్రక్కుల ఉల్లి ఆప్ఘనిస్తాన్‌, టర్కీల నుంచి చేరుకుందని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. పంజాబ్‌లో పెద్ద ఎత్తున ఆప్ఘన్‌ ఉల్లిని సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక పలు నగరాలు, పట్టణాల్లోనూ ఉల్లి ధరలు స్వల్పంగా తగ్గడంతో ఉల్లి ఘాటు నుంచి త్వరలోనే ఉపశమనం కలుగుతుందన్న అంచనాలు వెల్లడవుతున్నాయి.

మరిన్ని వార్తలు