వారిని ఎందుకు వదిలేశారు..

29 Jul, 2015 18:28 IST|Sakshi

న్యూఢిల్లీ:  ముంబై వరుస బాంబుపేలుళ్ల దోషి యాకూబ్ మెమన్కు ఉరిశిక్షను ఖరారు  చేయడంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతిని వ్యక్తంచేసిన ఒవైసీ.. మెమన్ మరణశిక్షపై  విమర్శలు గుప్పించారు. యాకూబ్ మెమన్ క్యూరేటివ్ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు.. బుధవారం అతనికి మరణశిక్షను ఖరారుచేసింది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఒవైసీ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దోషులకు శిక్ష పడాల్సిందే.. మరి బాబ్రీ మసీదును కూల్చేసిన విధ్వంసకుల మాటేమిటని ప్రశ్నించారు. వారికి శిక్షలు ఎందుకు విధించరని ప్రశ్నించారు. ఒకవైపు మాజీ ప్రధాని రాజీవ్గాంధీ, బియాంత్ సింగ్ హంతకులకు శిక్షలు తగ్గిస్తూ, మరోవైపు మెమన్కు శిక్ష ఖరారు చేయడం ఏంటని ఆయన మండిపడ్డారు.  

అయితే అందరూ సంయమనం పాటించాలని.. చట్టాలను, కోర్టులను గౌరవించాలన్నారు.  శాంతి భద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కేవలం రాజకీయ మద్దతు లేనందువల్లే యాకూబ్కు ఉరిశిక్షను విధించారనేదే ఇప్పటికీ తన అభిప్రాయమన్నారు. యాకూబ్ పోలీసుల ముందు లొంగిపోయి, కీలకమైన సమాచారం అందించాడన్నారు. అయినా  అప్పటి ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు యాకూబ్కు న్యాయం చేయలేదని, మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాం జెఠ్మలానీ ,శతృఘ్నసిన్హా తదితరులు కూడా యాకూబ్ మెమన్ ఉరిశిక్షను వ్యతిరేకిస్తున్నారని ఒవైసీ గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు