ప్రియుడితో ఉంటానని భార్య చెప్పడంతో..

24 Aug, 2017 19:42 IST|Sakshi
ప్రియుడితో ఉంటానని భార్య చెప్పడంతో..

అన్నానగర్‌: భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగించడాన్ని భరించలేక ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఆత్మహత్యకు కారణమైన భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తాంబరంలో చోటుచేసుకుంది. చెన్నై, తాంబరం సమీపంలోని సంతోషపురం పార్కు వీధికి చెందిన రాజన్‌ (31) విజయనగర్‌ ప్రాంతంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో వ్యాన్‌ డ్రైవర్ గా పనిచేస్తుండేవాడు‌. ఇతని భార్య సీతాలక్ష్మి. వీరికి శృతి (6), వినీష్‌ (5) సంతానం.

ఈ క్రమంలో గత శనివారం ఉదయం రాజన్‌ తల్లిదండ్రులు గది తలుపుకొట్టగా అతడు తలుపు తెరవలేదు. తల్లిదండ్రులు స్థానికుల సహాయంతో తలుపు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కి రాజన్‌ ఉరి వేసుకుని శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న సేలైయూర్‌ పోలీసులు ఘటన స్థలానికి వచ్చి రాజన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం క్రోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తన చావుకు భార్య, ఆమె ప్రియుడు ఐవర్‌రాజ్‌ కారణమని రాజన్ రాసిన సూసైట్‌నోట్ పోలీసులకు లభ్యమైంది.

సంతోషపురం ప్రాంతంలో జిరాక్స్‌ షాపు నడుపుతున్న ఐవర్‌రాజ్‌తో గత మూడేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్టు పోలీసుల విచారణలో సీతాలక్ష్మి అంగీకరించింది. ఈ విషయం తెలిసి భర్త తనను మందలించగా.. తాను పిల్లలను రాజన్‌ వద్ద వదలి పుట్టింటికి వెళ్లినట్లు చెప్పింది. తప్పు సరిదిద్దుకునే అవకాశమిస్తూ కాపురానికి రావాలని భార్యకు ఫోన్ చేశాడని పోలీసులు చెప్పారు. ప్రియుడు ఐవర్‌రాజ్‌తో కలిసి జీవిస్తానని, కాపురానికి రానని చెప్పడంతో మనస్తాపం చెందిన రాజన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్‌ ఆత్మహత్యకి కారణమైన సీతాలక్ష్మిని, ఐవర్‌రాజ్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచి జైలుకు తరలించారు.

మరిన్ని వార్తలు