అతని భార్యను రాళ్లతో కొట్టి చంపారు

31 Jan, 2020 10:53 IST|Sakshi

ఫరూఖాబాద్‌(యూపీ): బర్త్‌డే అని పిలిచి 23 మంది పిల్లలను బందీలు చేసిన వ్యక్తిని పోలీసులు హతమార్చిన విషయం తెలిసిందే. అయితే  అతను చేసిన తప్పుకు ఆయన భార్యను గ్రామస్తులు కొట్టి చంపడం విషాదంగా మారింది. ఉత్తర ప్రదేశ్‌లోని మహ్మదాబాద్‌ ప్రాంతం కతారియాకు చెందిన సుభాష్‌ బథం అనే వ్యక్తి తన కూతురి పుట్టిన రోజు వేడుకలకు రావాల్సిందిగా స్థానిక పిల్లలను ఆహ్వానించాడు. దీంతో గురువారం మధ్యాహ్నం 23 మంది పిల్లలు అతని ఇంటికి చేరుకోగా వాళ్లందరినీ ఇంట్లో పెట్టి నిర్భందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పిల్లలను బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేశారు. అయితే నిందితుడు పోలీసులపైకి నాటుబాంబు విసరడంతోపాటు పలుమార్లు కాల్పులకు దిగాడు. దీంతో ముగ్గురు పోలీసులు, ఓ గ్రామస్థునికి గాయాలయ్యాయి.

పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సుమారు ఎనిమిది గంటపాటు ఆపరేషన్‌ నిర్వహించిన ఎన్‌ఎస్‌జీ(నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌) బృందాలు రాత్రి 1.20 సమయంలో పిల్లలను సురక్షితంగా విడిపించారు. ఇక నిందితుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు అతని భార్యను రాళ్లతో కొట్టి చంపారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి వచ్చేసరికి ఆమె తీవ్రగాయాలతో పడి ఉంది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించామని  పోలీసులు తెలిపారు.

చదవండి: కూతురు పుట్టిన రోజని పిలిచి

>
మరిన్ని వార్తలు