డ్రైవర్ భార్య అరెస్టు.. రూ. 80 లక్షలు స్వాధీనం

28 Nov, 2016 12:13 IST|Sakshi
డ్రైవర్ భార్య అరెస్టు.. రూ. 80 లక్షలు స్వాధీనం
ఏటీఎంలలో పెట్టాల్సిన కొత్త నోట్లు రూ. 1.37 కోట్లతో పారిపోయిన వ్యాన్ డ్రైవర్ భార్యను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి సుమారు రూ. 80 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన డొమినిక్ సెల్వరాజ్‌ను ఇంకా అరెస్టు చేయాల్సి ఉంది. నవంబర్ 23వ తేదీన పోలీసులు బెంగళూరు వసంతనగర్ ప్రాంతంలో ఖాళీగా వదిలిపెట్టిన వ్యాను నుంచి రూ. 45 లక్షల నగదు, ఒక తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. దాంతో ఈకేసులో నిందితుడు సెల్వరాజ్ అని గుర్తించి.. అతడిని పట్టుకోడానికి ముమ్మరంగా గాలింపు మొదలుపెట్టారు. 
 
కేంద్రప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత కొత్త 2వేల రూపాయలు, 100 రూపాయల నోట్ల కోసం ఏటీఎంల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే లాగిక్యాష్ అనే సంస్థకు చెందిన వ్యాన్ డ్రైవర్ డొమినిక్ సెల్వరాజ్ మొత్తం రూ. 1.37 కోట్లతో పారిపోయాడు. దాంతో పోలీసులు అతడి తల్లిని కూడా ప్రశ్నించారు. రెండు నెలల క్రితమే తన కొడుకు భార్యతో కలిసి వేరు కాపురం పెట్టాడని, ఇప్పుడు లింగరాజపురం ప్రాంతంలో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడని ఆమె చెప్పారు. ఆ సమాచారం మేరకు ఆ ఇంట్లో సోదాలు చేయగా.. సెల్వరాజ్ భార్య వద్ద 79.8 లక్షల రూపాయలు దొరికాయి. 
మరిన్ని వార్తలు