'సీడీఎస్‌గా భవిష్యత్‌ వ్యూహాలు రచిస్తా: బిపిన్ రావ‌త్‌'

31 Dec, 2019 15:49 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ తొలి త్రివిధ దళాధిపతిగా జనరల్‌ బిపిన్‌ రావత్‌ నియమితులయ్యారు. జనరల్‌ బిపిన్‌ రావత్‌ను సీడీఎస్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సీడీఎస్‌ హోదాలో ఆయన కొత్తగా ఏర్పాటయ్యే సైనిక వ్యవహారాల విభాగానికీ నాయకత్వం వహిస్తారు. అంతకుముందు ఆయన ఆర్మీ చీఫ్‌గా పదవీ విరమణ చేశారు. సీడీఎస్‌గా నియమితులైన బిపిన్‌ రావత్‌ సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త పదవితో తనపై మరిన్ని బాధ్యతలు పెరిగాయని అన్నారు. 28వ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న నవరాణే‌కు రావత్‌ అభినందనలు తెలిపారు. కాగా, రావత్ మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

చదవండి: సీఏఏకు తొలి షాక్‌.. కేరళ అసెంబ్లీలో తీర్మానం

ప్రస్తుతం ఆయన స్థానంలో ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నవరాణే బాధ్యతలు చేపట్టనున్నారు. పాక్‌, చైనా స‌రిహ‌ద్దుల వ‌ద్ద స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు భార‌త ఆర్మీ సిద్ధంగా ఉంద‌ని బిపిన్ తెలిపారు. ఇవాళే ఆర్మీ చీఫ్‌గా రిటైర్ అయ్యాను, ఆర్మీ చీఫ్‌గా ఎన్నో బాధ్య‌త‌లు ఉంటాయి, ఇన్నాళ్లూ వాటిమీదే దృష్టి పెట్టాను. అయితే సీడీఎస్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత త‌న పాత్రపై కొత్త వ్యూహాన్ని ర‌చించనున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 1978 డిసెంబర్‌లో ఆర్మీలో చేరిన బిపిన్ రావత్ 2017 జనవరి 1 నుంచి నేటి వరకు ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా.. కేంద్రం సీడీఎస్‌ పదవిని సృష్టించేందుకు భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఇటీవల సీడీఎస్ పదవికి ఆమోదం తెలిపింది. త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని అంశాలపై రక్షణ మంత్రికి ఏకైక సలహాదారుగా సీడీఎస్‌ వ్యవహరిస్తారు.
చదవండి: '3కోట్ల మంది కస్టమర్లను కోల్పోయిన వొడాఫోన్‌ ఐడియా'

>
మరిన్ని వార్తలు