పద్మభూషణ్‌ వెనక్కిచ్చేస్తా: హజారే

4 Feb, 2019 05:32 IST|Sakshi

రాలేగావ్‌సిద్ధి: కేంద్ర ప్రభుత్వం తన డిమాండ్లను నెరవేర్చకపోతే ఇచ్చిన పద్మభూషణ్‌ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తానని సామాజిక కార్యకర్త అన్నాహజారే హెచ్చరించారు. రాలేగావ్‌ సిద్ధిలో చేపట్టిన ఆమరణ దీక్ష ఆదివారం నాటికి ఐదోరోజుకు చేరింది. ఆయన  ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ..మోదీ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే 1992లో ఇచ్చిన పద్మభూషణ్‌ పురస్కారాన్ని వాపసు చేస్తానని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. తక్షణమే లోక్‌పాల్, లోకాయుక్తలను ఏర్పాటు చేయడంతో పాటు  స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. ఎన్నికల సంస్కరణలు చే పట్టాలని డిమాండ్‌ చేశారు. కాగా, హజారేకు డాక్టర్‌ ధనంజయ పొటే ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఐదురోజుల్లోనూ ఆయన 3.8 కేజీల బరువు తగ్గిపోయినట్లు తెలిపారు. హజారే ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాలేగావ్‌ సిద్ధి గ్రామప్రజలు  అహ్మద్‌నగర్‌–పుణె జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో బైఠాయించారు. దీంతో  ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

మరిన్ని వార్తలు