టైపింగ్‌లో తప్పిదం.. పరారీలో హంతకుడు

3 Apr, 2017 20:24 IST|Sakshi

న్యూఢిల్లీ: టైపింగ్‌లో తప్పు దొర్లడంతో ఓ హంతతకుడు జైలు నుంచి విడుదల అయ్యాడు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో టైపింగ్‌ తప్పిదంతో రెండు హత్య కేసుల్లో దోషిగా నిర్ధారణ అయిన వ్యక్తి జైలు నుంచి రిలీజ్‌ అయ్యాడు.  ఢిల్లీ వర్సిటీ మాజీ విద్యార్థి అయిన జితేందర్‌ 1999 మార్చి 10న ఓ విద్యార్థి సంఘ నాయకుడ్ని హత్య చేశాడు. ఆ మరుసటి రోజు ఈ ఘటనపై పోలీసులకు సమాచారమిచ్చిన ఓ సాక్షి ఇంటికి వెళ్లి అతని తండ్రిని చంపేశాడు.

జితేందర్‌కు మొదటి కేసులో 30 ఏళ్ల జైలు శిక్ష, మరో కేసులో జీవిత ఖైదు విధిస్తూ ట్రయల్‌ కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై జితేందర్‌ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్‌ చేశాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం జితేందర్‌ ఇప్పటికే 16 ఏళ్ల 10 నెలల పాటు జైలు శిక్ష అనుభవించినందున అతన్ని విడుదల చేస్తూ 2016 డిసెంబర్‌ 24న తీర్పు వెలువరించింది. దీనిపై సాక్షులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిని విచారించిన హైకోర్టు డిసెంబర్‌ 24న వెలువరించిన తీర్పులో టైపింగ్‌ తప్పిదం దొర్లిందని పేర్కొంది. అంతకుముందు తీర్పులో పేర్కొన్న.. ఇప్పటికే 16 ఏళ్ల 10 నెలల పాటు శిక్ష పూర్తయ్యింది. ఇతర కేసుల్లో దోషి అవసరం లేకుంటే విడుదల చేయొచ్చు.. అన్న వాక్యాలను తొలగిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 14న మళ్లీ తీర్పునిచ్చింది. అలాగే, జితేందర్‌ను అరెస్టు చేయాలని, సాక్షులకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. కాగా, జితేందర్‌ విడుదలైనప్పటి నుంచి పరారీలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు