ఎంపీలకు వల.. కిలేడీ అరెస్ట్!

2 May, 2017 13:26 IST|Sakshi
ఎంపీలకు వల.. కిలేడీ అరెస్ట్!

న్యూఢిల్లీ: ఎంపీలను బురిడీ కొట్టించిన కిలేడీని ఉత్తరప్రదేశ్‌లోని ఇందిరాపురంలోని ఆమె ఇంటికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేతలను కలిసి వారికి మాయమాటలు చెప్పి ఏదో రకంగా వారితో అసభ్యంగా ఫొటోలు దిగి బ్లాక్ మెయిల్ చేస్తున్న మహిళను ఢిల్లీ పోలీసులు నేడు ప్రశ్నించనున్నారు. ఇటీవల గుజరాత్‌లోని వల్సాద్‌కు చెందిన బీజేపీ ఎంపీ కేసీ పటేల్‌కు మత్తుమందు ఇచ్చి ఆపై ఆయనతో అసభ్యంగా ఫొటోలు దిగిన ఆ మహిళ రూ.5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. అంతా మోసమని గ్రహించిన ఎంపీ పటేల్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో.. మార్చి నెలలో డిన్నర్‌కు పిలిచి అత్యాచారం చేశారని, ఆసమయంలో తాను ఎలాగోలా వీడియో తీశానని మహిళ ఆరోపించడం అప్పట్లో కలకలం రేపింది.

ఘజియాబాద్ పోలీసుల వద్దకు వెళ్లి తనకు న్యాయం చేయాలని ఆ మహిళ కోరింది, ఢిల్లీ పరిధిలో అన్యాయం జరిగింది కనుక అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఢిల్లీ పోలీసుల వద్దకు వెళ్లి ఎంపీ కేసీ పటేల్ పలుమార్లు తనపై అత్యాచారం చేశానని కథలు చెప్పింది. అయితే ఆమె చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవని అక్కడి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. గతేడాది హర్యానాకు చెందిన ఎంపీ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసిన ఆ మహిళ.. కేసు విచారణ ప్రారంభించగానే కేసు వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆమె వెనుక పెద్ద ముఠా ఉందని భావించిన ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ముకేష్ మీనా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.

ఎంపీ కేసీ పటేల్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఓ మహిళ డబ్బు కోసం తనపై లేనిపోని ఆరోపణలు చేసిందన్నారు. సాయం కోసం వచ్చిన మహిళ కూల్ డ్రింకులో మత్తుమందు కలిపిందని, ఆపై తన గ్యాంగుతో కలిసి కొన్ని వీడియోలు తీసిందని ఆరోపించారు. ఘజియాబాద్‌లో ఇల్లు రాసివ్వాలని లేనిపక్షంలో వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిందని తెలిపారు. బ్లాక్ మెయిల్, దోపీడీకి సంబంధించిన విషయాలపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, తాను నిర్దోషినని తేలుతుందని ధీమా వ్యక్తంచేశారు.

>
మరిన్ని వార్తలు