ఫేక్‌ ఫొటో: డిటెన్షన్‌ సెంటర్లో తల్లి.. బయట చిన్నారి

13 Jan, 2020 13:02 IST|Sakshi

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంపై నిరసలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దేశంలో డిటెన్షన్‌ సెంటర్లే లేవని ప్రధాని నరేంద్ర మోదీ చెప్తుండటంతో.. చోటు ఖాన్‌ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో ఓ ఫొటో షేర్‌ చేశాడు. ‘డిటెన్షన్‌ సెంటర్లు లేవు కదా..!!’ అని పేర్కొంటూ.. కంచె లోపల నుంచి బిడ్డకు పాలు పడుతున్న ఓ తల్లి ఫొటోను దాంతోపాటు బెంగాళీలో దాని నేపథ్యాన్ని రాసుకొచ్చాడు. ‘పౌరసత్వ చట్టం కారణంగా బంగ్లాదేశ్‌కు చెందిన ఈ దంపతుల వేదన చూడండి. అతనేమో హిందువు, ఆమెనేమో ముస్లిం. ఎన్నార్సీ కారణంగా ఆ మహిళ డెటెన్షన్‌ క్యాంప్‌లో బందీ అయింది. అందుకే ఈ దుస్థితి. నరేంద్ర మోదీ పాలనలో ఇలాంటి మరెన్నో చూస్తాం’అని చోటు ఖాన​ పేర్కొన్నాడు. అయితే, ఈ ఫొటో ఫేక్‌ అని తేలింది.


అర్జెంటీనా దంపతులకు చెందిన ఈ  ఫొటో గత ఆరేళ్లుగా వివిధ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోందని ఇండియా టుడే ఫ్యాక్ట్‌ చెక్‌ తెలిపింది.‘controappuntoblog.org’ అనే బ్లాగ్‌లో 2013 జనవరి13న ఈ ఫొటో తొలిసారిగా అప్‌లోడ్‌ అయిందని పేర్కొంది. అర్జెంటీనాలోని ఒక ప్రాంతంలో ఉద్రిక్తలు చోటుచేసుకోవడంతో పోలీసులు అక్కడ కంచె ఏర్పాటు చేశారని, ఆ సమయంలో కొన్ని కుటుంబాలు కంచెకు ఆవల మరికొన్ని ఇవతలి వైపున ఉండిపోయానని స్పష్టం చేసింది. భారత్‌లో ఉన్న డిటెన్షన్‌ సెంటర్లకు, సీఏఏ ఆందోళనలకు ఈ ఫొటోతో ఎలాంటి సంబంధం లేదని ఇండియా టుడే వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు