సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని పాత రైల్వే స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. దొంగనుంచి తన హ్యాండ్బ్యాగును రక్షించుకునే ప్రయత్నంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. రాజస్థాన్కు చెందిన సుధీర్ బన్సల్(40) అనే మహిళ తన కుమారుడు గౌరవ్తో కలిసి యోగా ఎక్స్ ప్రెస్లో ఢిల్లీకి వస్తుండగా ఈ సంఘటన జరిగింది.
సుధీర్ బన్సల్ కుమారుడు గౌరవ్ ఇటీవల ఢిల్లీ యూనివర్శీటిలో చేరాడు. ఇద్దరూ కలిసి అతడికి వసతి వెతకడానికి ఢిల్లీకి బయలుదేరారు. రైలు మిథై పుల్ సమీపానికి చేరుకునే టైంలో కంపార్ట్మెంట్ తలుపు దగ్గర నిల్చొని ఉండగా, దుండగుడు ఆమె బ్యాగును లాక్కొనే ప్రయత్నం చేశాడు. దీన్ని ఆమె తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలో అదుపు తప్పి ఆమె రైలు కింద పడిపోయారు. అయితే ఆమెను కాపాడేందుకు కొడుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. రైలు పట్టాలపై పడి తీవ్రంగా గాయపడిన ఆమె సమీప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
బ్యాగులో ఉన్న నగదు, ఇతర పత్రాలతో సహా ఎటిఎమ్ కార్డుతో దొంగ పారిపోయాడని పోలీసులు చెప్పారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టమని అధికారులు తెలిపారు.