సీఏఏ నిరసనల్లో ‘పాక్‌ జిందాబాద్‌’ నినాదాలు

21 Feb, 2020 04:11 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటకలో జరిగిన పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలో ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ నినాదాలు నిర్వాహకులను ఇబ్బందిపెట్టాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సమక్షంలోనే ఒక మహిళ ఈ నినాదాలు చేసింది. ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’ పేరుతో బెంగళూరులో గురువారం సీఏఏ వ్యతిరేక ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శనకు అసదుద్దీన్‌ ఓవైసీ కూడా హాజరయ్యారు. ఆయన రాగానే వేదికపైకి వచ్చిన అమూల్య లియోనా అనే మహిళ ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ అని నినదించడం ప్రారంభించింది. అక్కడ ఉన్న ఆందోళనకారులను కూడా తనతో పాటు నినదించమని కోరింది. నిర్వాహకులు అడ్డుకున్నా.. ఆమె ఊరుకోలేదు. ఈ లోపు ఆమె దగ్గరకు వెళ్లిన అసదుద్దీన్‌ ఆమె వద్ద నుంచి మైక్‌ను లాగేసుకోవడానికి ప్రయత్నించారు.

చివరకు పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై దేశద్రోహం కేసు పెట్టే అవకాశముంది. కాగా, ఆ తరువాత ప్రసంగించిన అసదుద్దీన్‌.. ఆ మహిళతో, ఆమె అభిప్రాయాలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. నిర్వాహకులు ఆమెను ఈ కార్యక్రమానికి ఆహ్వానించకుండా ఉంటే బావుండేదన్నారు. ‘ఆమె ఇలా ప్రవర్తిస్తారని తెలిస్తే.. నేను ఈ కార్యక్రమానికి వచ్చేవాడిని కాదు. మేం భారతీయులం. శత్రుదేశం పాకిస్తాన్‌కు మద్దతిచ్చే ప్రశ్నే లేదు. భారత్‌ను కాపాడాలనేదే మా ఉద్యమం ఉద్దేశం’ అని ఓవైసీ వివరించారు. ఈ ఘటనపై బీజేపీ స్పందించింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలన్నీ పాకిస్తాన్, కాంగ్రెస్‌ నేతృత్వంలోని జాతివ్యతిరేక శక్తుల మధ్య జాయింట్‌ వెంచర్‌లో భాగమని ఆరోపించింది. బెంగళూరు ఘటనను కాంగ్రెస్‌ కూడా ఖండించింది.  

మరిన్ని వార్తలు