'క‌రోనా క‌న్నా ముందు ఆక‌లి చంపేలా ఉంది'

9 Jun, 2020 16:39 IST|Sakshi

భోపాల్‌: లాక్‌డౌన్ పుణ్య‌మా అని చిన్న‌చిన్న వ్యాపారాలు కుదేల‌య్యాయి. అనేక‌మంది ఉపాధి కోల్పోవడంతో వారి జీవితాల్లో ఆకలి కేకలే కనబడుతున్నాయి. ఒకవైపు కరోనా.. మరొకవైపు ఆకలి చాలా మంది జీవితాలను ఛిద్రం చేసింది. మ‌ధ్యప్ర‌దేశ్‌కు చెందిన ఓ మ‌హిళ ఉపాధి కోల్పోవడంతో తిన‌డానికి తిండి లేక‌, కుటుంబ పోష‌ణ భార‌మై త‌న తాళిబొట్టునే అమ్మేసుకుంది. కౌశ‌ల్య పాటిల్ అనే మ‌హిళ‌ కుటుంబంతో క‌లిసి భోపాల్‌లోని విధాన స‌భ సెక్ర‌టేరియ‌ట్‌కు స‌మీపంలోని మురికివాడ‌లో జీవ‌నం సాగిస్తోంది. ఆమె భ‌ర్త ప‌క్ష‌వాతంతో మంచాన ప‌డ‌టంతో కుటుంబ భారాన్ని భుజానికెత్తుకుంది. కానీ, క‌రోనా వ‌ల్ల‌ ఆమె జీవితం త‌ల‌కిందులైంది. దేవాల‌యాల్లో ద‌ర్శ‌నాలు నిలిపివేయ‌డంతో ఆల‌యం ముందు ప్ర‌సాదాలు అమ్ముకునే త‌న‌ వ్యాపారం ఆగిపోయింది. (కరోనా విలయం: విదారక ఘటన)

ఈ క్ర‌మంలో ఆదాయం లేక‌ పూట గ‌డ‌వ‌డ‌మే గ‌గ‌నంగా మారింది. ఈ విష‌యం గురించి కౌశ‌ల్య పాటిల్ మాట్లాడుతూ.. "ఆల‌యాలు తెర‌వ‌గానే భ‌క్తులంద‌రూ మ‌ళ్లీ గుళ్ల‌బాట ప‌డ‌తార‌న్న న‌మ్మ‌క‌ముంది. అలా జ‌ర‌గ‌క‌పోతే క‌రోనా క‌న్నా ముందు ఆక‌లే మ‌మ్మ‌ల్ని చంపేసేలా ఉంది. అందుకే నా మంగ‌ళ‌సూత్రాన్ని రూ.5 వేల‌కు అమ్మేసి కుటుంబానికి ఇంత భోజనం పెడుతున్నాను. నా కొడుకు ఓ పెట్రోల్ పంపులో ప‌నిచేస్తున్నాడు. కానీ అత‌డికొచ్చే ఆదాయం ఇంటి అద్దెకే స‌రిపోతుంది" అని ఆమె దీన‌గాథ‌ను చెప్పుకొచ్చింది. (రియల్‌ హీరో అనిపించుకున్న కానిస్టేబుల్‌)

చ‌ద‌వండి: ఎద్దు కడుపులో బంగారు మంగళసూత్రం

మరిన్ని వార్తలు