నోయిడా: ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణహత్యకు గురైంది. తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ బేస్మెంట్ వద్ద ఆమెను ఓ దుండగుడు కాల్చి చంపాడు. వివరాల్లోకి వెళితే... నోయిడా సెక్టార్లో అంజలీ రాథోర్ (23) ప్రముఖ లావా మొబైల్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ట్రయినీ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. హర్యానా యమునా విహార్కు చెందిన ఆమె ఉద్యోగరీత్యా నోయిడాలో ఉంటోంది. మరో ఆరుగురు యువతులతో కలిసి అంజలీ శతాబ్ధి విహార్లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తోంది. ఓ ఫోన్ కాల్ రావడంతో ఆమె అపార్ట్మెంట్ బేస్మెంట్ వద్దకు వెళ్లింది. ఇంతలో మొహానికి ముసుగు ధరించిన ఓ యువకుడు బైక్ వచ్చి, అంజలిపై దగ్గరనుంచి కాల్పులు జరిపి, అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ వ్యవహారం అంతా
పార్కింగ్ ఏరియాలోని ఉన్న సీసీ టీవీలో నమోదు అయింది. కాగా తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా అంజలి రూమేట్స్ను పోలీసులు ప్రశ్నించగా... ఆమె బాయ్ఫ్రెండ్ నుంచి ఉదయం ఫోన్ కాల్ రావడంతో కిందకు వెళ్లిందని, ఇంతలోనే దారుణం జరిగినట్లు తెలిపారు. కేసును అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.