భార్యను ఇంటికి రావద్దన్న ప్రబుద్ధుడు

7 Jul, 2020 20:13 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సర్ధిచెప్పిన పోలీసులు

బెంగళూర్‌ : కోవిడ్‌-19 సోకుతుందనే భయంతో తాళి కట్టిన భార్యను ఇంటిలోకి అడుగుపెట్టకుండా అడ్డుకున్నాడో ప్రబుద్ధుడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూడు నెలల పాటు పంజాబ్‌లో చిక్కుకుపోయిన మహిళ (38) లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం బెంగళూర్‌లోని మెట్టినింటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కర్ణాటక ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రంలోకి వచ్చే ప్రయాణీకులందరూ విధిగా హోం క్వారంటైన్‌లో ఉండాలి. దీంతో బెంగళూర్‌లో తన భర్త ఇంటికి వెళ్లిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ‘నువ్వు ఇంటికి వస్తే నాకూ కరోనా వైరస్‌ సోకుతుంద’ని చెబుతూ ఆమెను ఇంటిలోకి రానిచ్చేందుకు భర్త నిరాకరించాడు.

ఆమెను ఇంట్లోకి అడుగుపెట్టేందుకు అనుమతించకుండా మరోచోట క్వారంటైన్‌కు వెళ్లాలని ఉచిత సలహా పారేశాడు. భర్త తీరుతో విస్తుపోయిన మహిళ వార్తుర్‌ పోలీస్‌లను ఆశ్రయించడంతో పాటు మహిళా హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు, హెల్ప్‌లైన్‌ అధికారులు ఆయనకు కౌన్సిలింగ్‌ ఇచ్చి మహిళను తన ఇంట్లోకి అడుగుపెట్టేలా చేశారు. కాగా వీరిద్దరి వైవాహిక జీవితంలో చాలాకాలంగా కలతలు చోటుచేసుకున్నాయని, గత కొన్నేళ్లుగా పలుమార్లు గొడవపడ్డారని వారు తెలిపారు. చదవండి : చైనాను దాటేసిన ముంబై

మరిన్ని వార్తలు