ప్రేమ గెలిచినా.. దేవుడు ఓడించాడు

29 Jul, 2016 11:23 IST|Sakshi
ప్రేమ గెలిచినా.. దేవుడు ఓడించాడు

ముంబయి: సాధారణంగా హర్యానా అంటేనే అమ్మాయిల విషయంలో చాలా కఠినం. పరువుకోసం ప్రాణాలు తీస్తారక్కడ. ప్రేమ దోమ అంటే ఉప్పుపాతరేస్తారు. అలాంటి హర్యానాలో తన తల్లిదండ్రులను సైతం ఎదిరించి తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంది. కానీ దురదృష్టం ఆమెను వెంటాడింది. రోడ్డు ప్రమాదం రూపంలో తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ప్రాణాలు పోయాయి. గతంలో ఎలాంటి గాయాలు ఎదుర్కొన్నా బతికిపోవడంతో ఈసారి కూడా తన భర్తకు ఏంకాదని తన మనసులో ఉన్న గుండె ధైర్యం చెదిరిపోయింది.

అయినా.. మరింత లోతుగా ఆలోచించి బ్రెయిన్ డెడ్ అయిన తన ప్రియమైన భర్త అవయవాలను పలువురికి ధైర్యంగా దానం చేసింది. వాళ్లందరిలో అతడిని చూసుకుంటున్నానని చెబుతోంది. ఆమె పేరే సోనియా సతాం. శేఖర్ (35) అనే వ్యక్తి బౌన్సర్ గా పనిచేసేవాడు. అతడిపై క్రిమినల్ రికార్డు కూడా ఉంది. ఇతడికి ఢిల్లీలో ఎంబీఏ చదువుతున్న సోనియా పరిచయం అయింది. అక్కడే వారిద్దరు ప్రేమలో పడ్డారు. అయితే, తనకంటే పదేళ్లు పెద్దవాడైన శేఖర్ ను ప్రేమిస్తుందని తెలిసి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. ఫోన్ పక్కకు పడేసి తొమ్మిది నెలలు బంధించారు.

అయితే, అన్ని మర్చిపోయినట్లు చేసి ఉద్యోగం పేరుతో బయటకు వచ్చిన సోనియా శేఖర్ కు ఫోన్ చేసింది. అతడు ఆమెను ముంబయికి తీసుకెళ్లాడు. కానీ ఆమె తల్లిదండ్రులు కేసులు పెట్టారు. అతడిని విడిచిపెట్టకుంటే చంపేస్తామని చెప్పారు. కానీ, ఆమె మాత్రం శేఖర్ తోనే ఉండిపోతానని చెప్పి తన దగ్గర ఉన్న బంగారు సొమ్మంతా తల్లిదండ్రులకు ఇచ్చేసి అతడితో వచ్చేసింది. అత్తమామలు కూడా అంగీకరించారు. ప్రస్తుతం ఓ ట్రావెల్ ఏజెంట్ గా పనిచేస్తున్న శేఖర్ ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో అతడి కళ్లను, కాలేయాన్ని ఇతర అవయవాలను సోనియా ధైర్యంగా దానం చేసింది. ఇలాంటి పనిచేయడానికి తాను ఎంతో ధైర్యం చేశానని తన మూడేళ్ల బాబును ఎత్తుకొని ఏడుస్తూ చెప్పింది.

మరిన్ని వార్తలు