ప్రేమపెళ్లి.. కట్నం కోసం అమ్మకానికి కిడ్నీ!

18 Oct, 2017 19:34 IST|Sakshi

న్యూఢిల్లీ: నచ్చిన వాడిని మనువాడేందుకు ఓ యువతి త్యాగానికి సిద్ధపడింది. అతడి కోసం తన కిడ్నీని అమ్మడానికి సైతం సిద్ధపడింది. బిహార్‌కు చెందిన ఓ యువతి (21)కి ఇదివరకే పెళ్లయింది. అయితే, భర్త నుంచి విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ క్రమంలో యూపీలోని మొరాదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని ఆమె ప్రేమించింది. కానీ, కట్నం ఇస్తేగానీ తాళి కట్టేది లేదని ఆమె ప్రేమికుడు స్పష్టం చేశాడు. తల్లిదండ్రులు వ్యతిరేకించినప్పటికీ అతడినే పెళ్లి చేసుకోవాలని ఆమె పట్టుదలతో ఉంది.

అతడు అడిగినంత కట్నం ఇవ్వబోమని తల్లిదండ్రులు తెగేసి చెప్పటంతో ఇటీవల ఢిల్లీ చేరుకుంది. అక్కడి ప్రభుత్వ ఆస్పత్రి అధికారులను కలిసి తన కిడ్నీని రూ.1.80లక్షలకు అమ్మేస్తానని చెప్పింది. ఉన్నతాధికారులకు విషయం తెలియడంతో ఆమెను కలిసి మాట్లాడారు. కట్నం అడిగిన వరుడిపై కేసు పెట్టాలని వారు సూచించారు. అందుకు ఆమె తిరస్కరించటంతో పాటు అతని వివరాలు తమకు చెప్పాలని కోరినా వినిపించుకోకుండా తిరిగి సొంతూరుకు వెళ్లిపోయింది. ఈ మేరకు ఢిల్లీ అధికారులు బిహార్‌ మహిళా కమిషన్‌ అధికారులను అప్రమత్తం చేశారు.

మరిన్ని వార్తలు