భద్రతపై సెల్ కంపెనీ షియోమీ వివరణ

26 Oct, 2014 14:49 IST|Sakshi
భద్రతపై సెల్ కంపెనీ షియోమీ వివరణ

న్యూఢిల్లీ: ఇండియన్‌ సెల్‌ఫోన్‌ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోన్న చైనాకు చెందిన సెల్ కంపెనీ షియోమీ వినియోగదారుల నుంచి తాము ఎటువంటి డేటాను తీసుకోవడంలేదని వివరణ ఇచ్చింది.  ఈ కంపెనీ మన దేశంలో లాంఛ్‌ చేసింది రెండే రెండు ఫోన్లు. ఒకటి ఎంఐ3,  రెండు రెడ్‌ మి 1ఎస్. ఈ రెండు ఫోన్లను ఫ్లిఫ్‌కార్ట్‌లో పెడితే స్టాక్‌ క్షణాల్లో ఖాళీ అయిపోతోంది. అంత క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ఫోన్ల భద్రపై ఇప్పుడు దేశంలో చర్చ నడుస్తోంది.

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఈ కంపెనీ ఫోన్లపై నిషేధం విధించారు. ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగులు ఎవరూ షియోమీ ఫోన్లను వాడకూడదని ఆదేశించారు. ఈ ఫోన్ల ద్వారా ఇండియా సమాచారాన్ని చైనీయులు దొంగలిస్తున్నారనే అనుమానం నేపథ్యంలో ఎయిర్‌ఫోర్స్‌ ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ బ్రాండ్‌ వ్యాల్యును దెబ్బతీసే ఈ వార్తలపై షియోమీ వెంటనే స్పందించింది. చైనా నుంచి తన సర్వర్లను కాలిఫోర్నియా, సింగపూర్‌లకు తరలించనున్నట్లు కంపెనీ తెలిపింది.

అనుమతిలేకుండా తాము ఎటువంటి డేటాను తీసుకోవడంలేదని తెలిపింది. భారత ప్రభుత్వ అధికారులను కలిసి ఈ వార్తలపై వివరణ ఇస్తామని పేర్కొంది. అభ్యంతరాలపై తగిన సమాచారం అందజేస్తామని తెలిపింది.
**

మరిన్ని వార్తలు