అయోధ్య తీర్పు: యశ్వంత్‌ సంచలన వ్యాఖ్యలు

18 Nov, 2019 10:57 IST|Sakshi

ముంబై : అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీజేపీ మాజీ సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా తప్పుబట్టారు. అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తప్పుడు తీర్పు ఇచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై లిటరేచర్‌ ఫెస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘ ఇది కచ్చితంగా తప్పుడు తీర్పే. ఇందులో ఎన్నో లొసుగులు ఉన్నాయి. అయితే ముస్లిం వర్గం ఈ తీర్పును ఆమోదించాలని కోరుతున్నా. జరిగిందేదో జరిగిపోయింది. ముందుకు సాగాల్సిందే తప్పదు. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత మరో తీర్పు ఇచ్చే అవకాశం ఉండదు’ అని పేర్కొన్నారు. అదే విధంగా బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో ఎల్‌కే అద్వానీ, మరికొంత మంది బీజేపీ సీనియర్‌ నేతలు తొలుత పశ్చాత్తాపం వ్యక్తం చేసినా.. ఆ తర్వాత రామ మందిర నిర్మాణ ఉద్యమం ద్వారా వచ్చిన కీర్తి కారణంగా ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించారని చెప్పుకొచ్చారు. 

కాగా అయోధ్యలో వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి రామ్‌లల్లాకే చెందుతుందని మాజీ సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా అయోధ్యలోనే ముస్లింల కోసం మసీదు నిర్మాణానికై ఐదెకరాల స్థలాన్ని కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే తొలుత ఈ తీర్పును స్వాగతించిన ముస్లిం లా బోర్డు.. తీర్పును సవాలు చేయబోమని స్పష్టం చేసింది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేస్తామని ఆదివారం సంచలన ప్రకటన చేసింది. అదే విధంగా తమకు కేటాయిస్తామన్న ఐదెకరాల భూమి కూడా అవసరం లేదని తేల్చిచెప్పింది.

మరిన్ని వార్తలు