శాస్త్రవేత్తలకూ అంతుపట్టని యోగాసనాలు

21 Jun, 2020 08:06 IST|Sakshi

ఆరోగ్యం కోసం యోగా...

మన భారతీయ ప్రాచీన ఆరోగ్య విద్య యోగా ద్వారా కరోనాను అల్లంత దూరంలో ఉంచడం సాధ్యమే అంటున్నారు సాధకులు! అంతర్జాతీయ యోగా దినోత్సవమైన ఈ రోజు (జూన్‌ 21, ఆదివారం)న ఒక్కసారి.. ఆధునిక సైన్స్‌ కూడా నిర్ధారించిన యోగాసన ప్రయోజనాలు ఏమిటో?.. కరోనాను అడ్డుకునేందుకు, రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు ఏం చేయాలో చూద్దామా?

జూన్‌ 21.. అంతర్జాతీయంగా భారత ఖ్యాతి ఇనుమడించే రోజిది. దేశదేశాల్లో చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా కొన్ని కోట్లమంది  యోగాసనాలు ఆచరించే రోజు. ప్రాచీన భారతీయ సంస్కృతిని కొనియాడే రోజు. ఆరేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్ణయించింది మొదలు ఏటికేడాది దీని ప్రాభవం, ప్రాముఖ్యత పెరుగుతూనే ఉన్నాయి. భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ యోగా దినోత్సవాలకు పిలుపునివ్వడం ఒక విశేషమైతే.. ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం దీన్ని గుర్తించి అందరూ యోగా ద్వారా స్వస్థత పొందాలని కోరడం ఇంకో విశేషం. అయితే ప్రస్తుత కరోనా కష్టకాలంలో మునుపటిలా బహిరంగంగా యోగాసనాలు వేయడం సాధ్యం కాకపోవచ్చుగానీ.. వర్చువల్‌ యోగా దినోత్సవాలకు మాత్రం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. (కోటి మంది యోగా చేస్తారు)

‘‘ఆరోగ్యం కోసం యోగా.. ఇంట్లోనే యోగా’’ అనే ఇతివృత్తంతో ఈ రోజు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కల్చరల్‌ రీసెర్చ్‌తో కలిసి ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఓ వీడియో బ్లాగింగ్‌ పోటీని కూడా ఏర్పాటుచేసింది. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ‘‘ఇంట్లోనే యోగా.. కుటుంబంతో కలిసి యోగా’ పేరుతో ఇప్పటికే ప్రచారం చేపట్టింది. ఆదివారం ఉదయం 6.30 నిమిషాలకు దూరదర్శన్‌ చానల్‌లో ఓ యోగ సాధన కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి. అలాగే మైసూరు జిల్లా యంత్రాంగం, ఇంటర్నేషనల్‌ నేచురోపతి ఆర్గనైజేషన్లు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాయి. కర్ణాటకలోని పుణ్యక్షేత్రం ధర్మస్థలలో ఉదయం ఏడు గంటలకు యోగాభ్యాసం మొదలుకానుంది. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే అమెరికాలోని టెక్సాస్‌తోపాటు అనేక ఇతర రాష్ట్రాల వారికి యోగా పాఠాలను బాబా రామ్‌దేవ్‌ ఆన్‌లైన్‌ ద్వారా అందించనున్నారు. హ్యూస్టన్‌లోని భారతీయ కౌన్సిల్‌ జనరల్‌ ఉదయం పది గంటలకు రెండు గంటల లైవ్‌ యోగా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. టెక్సాస్‌లోని సాన్‌ఆంటోనియోలో రోజంతా యోగథాన్‌ జరగనుంది. నెదర్లాండ్స్‌ పోలీస్‌ విభాగం కూడా ఆన్‌లైన్‌ మాధ్యమంలో యోగాసనాలను ప్రదర్శించనున్నట్లు సమాచారం.

సైన్స్‌ చెప్పే యోగా లాభాలు...
మానసిక ఒత్తిడికి కారణమైన హార్మోన్‌ కార్టిసోల్‌ మోతాదులను తగ్గించేందుకు యోగా ఉపయోగపడుతుందని శాస్త్రీయంగా నిర్వహించిన అధ్యయనాలు చెబుతున్నాయి. ధ్యానం వంటివాటిని కలిపి యోగా ఆచరిస్తే మరిన్ని మెరుగైన ఫలితాలుంటాయని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. మెదడును శాంతపరిచేందుకు ఉపయోగపడే సెరటోనిన్‌ ఉత్పత్తిని పెంచుతుంది కాబట్టి మనో వ్యాకులతకూ యోగా మంచి మందని అధ్యయనాలు చెబుతున్నాయి. తాగుడు వ్యసనాన్ని మాన్పించేందుకు జరిపిన ఒక కార్యక్రమంలో సుదర్శన క్రియ యోగాను అభ్యాసం చేయించినప్పుడు వారిలో మనో వ్యాకులతకు సంబంధించిన లక్షణాలు బాగా తగ్గిపోయాయి.

వారానికి కనీసం రెండు రోజుల చొప్పున రెండు నెలలపాటు యోగా కొనసాగిస్తే మానసిక ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇదంతా ఎలా జరుగుతుందో మాత్రం శాస్త్రవేత్తలకూ అంతుపట్టకపోవడం గమనార్హం. 

వారానికి కనీసం రెండు రోజుల చొప్పున రెండు నెలలపాటు యోగా కొనసాగిస్తే మానసిక ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇదంతా ఎలా జరుగుతుందో మాత్రం శాస్త్రవేత్తలకూ అంతుపట్టకపోవడం గమనార్హం. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా కూడా తోడైతే గుండె జబ్బులు సోకే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. యోగాభ్యాసం చేసే వారి రక్తపోటు, పల్స్‌ రేట్‌ ఇతరుల కంటే తక్కువగా ఉన్నట్లు ఒక అధ్యయనం స్పష్టం చేయగా గుండెజబ్బులు ముదరకుండా కూడా యోగా రక్షణ కల్పిస్తుందని ఇంకో పరిశోధన ద్వారా తెలుస్తోంది. 

నిస్సత్తువ, భావోద్వేగాలను మెరుగుపరిచేందుకు యోగా మేలైన మార్గమని పరిశోధనలు చెబుతున్నాయి. 135 మంది వయోవృద్ధులపై జరిగిన ఒక పరిశోధనలో యోగాభ్యాసం చేసే వారి జీవన నాణ్యత ఇతరుల కంటే మెరుగ్గా ఉన్నట్లు స్పష్టమైంది. అంతేకాకుండా కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించేందుకూ యోగా పనికొస్తుంది. కీమోథెరపీ చేయించుకున్న వారు యోగా సాధన చేస్తే వాంతులు, తలతిరుగుడు వంటి దుష్ఫలితాలు తగ్గుతాయని, నొప్పి తగ్గడమే కాకుండా చురుకుదనమూ పెరుగుతుందని తేలింది. అలాగే హాయిగా నిద్రపోవాలన్నా యోగా ప్రాక్టీస్‌ చేయడం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఊబకాయం, అధిక రక్తపోటు, మనో వ్యాకులత వంటి లక్షణాల కారణంగా నిద్రలేమి సమస్య ఎదుర్కొన్న వారు యోగాభ్యాసం మొదలుపెట్టిన తరువాత ఎంతో ఉపశమనం పొందారని 2005 నాటి అధ్యయనం ఒకటి చెబుతోంది. సుఖనిద్రకు కారణమైన మెలటొనిన్‌ హార్మోన్‌ అధికోత్పత్తికి యోగా కారణమవుతుందని అంచనా.

రోగ నిరోధక శక్తికి ఆరు ‘యోగాలు’

ఈ కరోనా కాలంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు యోగ సాధన ద్వారా కూడా రోగ నిరోధకశక్తిని కాపాడుకోవచ్చు. సలంబ భుజంగాసనం, పరివృత్త ఉత్కటాసనం, అనువిత్తాసన, గరుడాసన, త్రికోణాసనం, ఆనంద బాలాసనం వంటి ఆరు యోగాసనాలు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.

సలంబ భుజంగాసనం
సలంబ భుజంగాసనం నేరుగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. బొక్కబోర్లా పడుకుని నడుము పైభాగాన్ని నిటారుగా ఉంచడం ఈ ఆసనంలోని ముఖ్యాంశం. ఈ క్రమంలో ముంజేతుల వరకు నేలపై ఆనించి ఉంచాలి. ముక్కు ద్వారా ఊపిరిపీల్చాలి. నోటి ద్వారా వదలాలి.

పరివృత్త ఉత్కటాసనం
పరివృత్త ఉత్కటాసనం సాధారణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మూత్రపిండాలు, జీర్ణావయవాలను మెలితిప్పడం ద్వారా శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది. కాళ్లను కొద్దిగా వంచి చేతులు జోడించి నడుము భాగాన్ని ఒకవైపునకు తిప్పి పైకి చూడటం ఈ యోగాసనంలో కనిపిస్తుంది. మోచేతులను తొడలకు తాకుతూ ఉండాలి. సాధారణ స్థితికి వచ్చే సమయంలో ఊపిరి వదలాలి.

అనువిత్తాసనం
అనువిత్తాసనం.. ఇది శరీరంలోని కొన్ని గ్రంథులను శుద్ధి చేస్తుంది. శ్వాసవ్యవస్థను చైతన్యపరిచేందుకూ ఈ యోగాసనం పనికొస్తుంది. నడుము కింది భాగంలో రెండు చేతులు ఉంచుకుని వీలైనంత వరకూ వెనక్కి వంగడమే ఈ అనువిత్తాససనం. ఊపిరి తీసుకుంటూ వెనక్కి వంగడం.. అదే స్థితిలో కొంత సమయం ఉండటం ఆ తరువాత ఊపిరి వదులుతూ నెమ్మదిగా సాధారణ స్థితికి రావడం ఈ ఆసన క్రమం.

మరిన్ని వార్తలు