సర్వం ‘యోగా’మయం...

21 Jun, 2018 09:20 IST|Sakshi
డెహ్రాడూన్‌లోని అటవీ పరిశోధన సంస్థ మైదానంలో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మోదీ

డెహ్రాడూన్‌, ఉత్తరాఖండ్‌ : డెహ్రాడూన్‌లోని అటవీ పరిశోధన సంస్థ మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీ నాల్గో ‘అంతర్జాతీయ యోగా దినోత్సవ’ వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు సుమారు 55 వేల మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ‘ఈ ఉరుకుల, పరుగుల జీవితంలో మనిషిని ప్రశాంతంగా ఉంచే సాధనం యోగా. మనిషి శరీరం, మెదడు, ఆత్మలను ఒకదానితో ఒకటి సమన్వయ పరిచి మనకు మానసిక ప్రశాంతతను చేకూర్చే దివ్య ఔషదం యోగా. డెహ్రాడూన్‌ నుంచి డబ్లిన్‌, షాంగై నుంచి చికాగో, జకర్తా నుంచి జోహాన్సబర్గ్‌  వరకూ ప్రాంతంతో సంబంధం లేకుండా యోగా విస్తరిస్తుంది. ఈ రోజు ప్రపంచాన్నంతా ఏకం చేసే శక్తి యోగాకు ఉంది’ అన్నారు.

దేశమంతటా...
దేశవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సామాన్యుడి నుంచి సైనికుడు వరకూ...గుమస్తా నుంచి ముఖ్యమంత్రి వరకూ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆసనాలు వేసారు.

మహారాష్ట్ర...
మహారాష్ట్ర గవర్నర్‌ సీ. విద్యాసాగర్‌ రావు నేతృత్వంలో రాజ్‌ భవన్‌లో యోగా దినోత్సావాన్ని నిర్వహించారు.  ముంబై మెరినా బీచ్‌లో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ పాల్గొన్నారు.

రాజస్థాన్‌లో...
రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వసుంధర రాజేతో పాటు యోగా గురువు బాబా రాందేవ్‌, ఆచార్య బాలక్రిష్ణ కూడా పాల్గొన్నారు.

ఢిల్లీలో....
ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యలయంలో కూడా యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. రాయబార కార్యలయ సిబ్బంది యోగా దినోత్సవ సందర్భంగా ఆసనాలు వేసారు.


నీటిలో యోగా...

అరుణాచల్‌ ప్రదేశ్‌ ఇండో- టిబెటన్‌ బార్డర్‌ పోలీసు సైనికులు కాస్తా విభిన్నంగా నీటిలో యోగా చేసారు. లోహిత్‌పూర్‌ ‘దిగారు’ నదిలో సైనికులు యోగాసానలు వేసారు.

మంచు ఎడారిలో...
లడఖ్‌ ఇండో - టిబెటన్‌ బార్డర్‌ పోలీసు అధికారులు 18 వేల అడుగుల ఎత్తున ఉన్న మంచు ఎడారిలో సూర్య నమస్కారాలు చేసారు.
 

మరిన్ని వార్తలు