లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కొత్త ఇంట్లోకి మారారు. లక్నోలోని కాళిదాస్ మార్గ్లో గల అధికారిక బంగ్లాలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లో పార్టీ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరినీ అక్కడికి పిలిచి వారికి ధన్యవాదాలు చెప్పారు. గొప్ప ఆతిథ్యం ఇచ్చి, సన్మానం చేసి గౌరవించారు. గొప్ప బాధ్యతలు భుజాన వేసుకున్నప్పుడే గొప్ప విజయాలు అందుతాయని, విజయాలు కూడా పెద్ద పెద్ద బాధ్యతలను తీసుకొని వస్తాయని ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నేతలకు చెప్పారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయడం వల్లే ఈ గొప్ప విజయం సాధ్యమైందంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ముఖ్యంగా తెర వెనుక ఉండి వ్యూహాలు సిద్ధం చేసి వాటిని అమలుచేస్తూ కీలకంగా పనిచేసిన వ్యక్తులను పొగడ్తల్లో ముంచెత్తారు. ‘పార్టీ కోసం కఠోరంగా పనిచేసి భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రతి ఒక్కరినీ నేను చూడాలని అనుకున్నాను. అందుకే ఈ ఆతిథ్యం’ అని యోగి అన్నారు. యోగి ఆహ్వానించిన వారిలో సీనియర్ మంత్రులు, ఆయన కేబినెట్ టీం, డిప్యూటీ ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బ్లాక్ మార్కెటింగ్ అనేది లేకుండా చేయడంతోపాటు, అవినీతి లేకుండా చేయడం, నిజాయితీతో పనిచేసేలా చూడటంలాంటివి చేయాలని తన మంత్రులకు సూచించారు.