ఆయన పులి అంట.. వీరంతా గాడిదలంట

9 May, 2016 08:45 IST|Sakshi
ఆయన పులి అంట.. వీరంతా గాడిదలంట

గోరఖ్ పూర్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. వివాదాస్పద పోస్టర్లు వేసి తీవ్రంగా అవమానించింది. రాహుల్ గాంధీని గాడిదగా పేర్కొంటూ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్ పూర్ లో బీజేపీ మైనారిటీ విభాగం ఒకటి గోడ పత్రికలు అంటించింది. ఒక్క రాహులే కాదు.. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, మాయావతి, అసదుద్దీన్ ఓవైసీలు గాడిదలు తోలుతున్నారని పేర్కొన్నారు. అదే సమయంలో బీజేపీ నేత యోగి ఆదిత్య నాథ్ ను పులితో పోలుస్తూ ఆయన పులిపై సవారీ చేసే వ్యక్తిగా అభివర్ణించారు.

అంతకుముందు రాహుల్ గాంధీని సింహంతో పోలుస్తూ సింహంపై సవారీ చేసే వ్యక్తిగా ఆయనను పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచార పోస్టర్లు విడుదల చేసిన నేపథ్యంలో దానికి కౌంటర్ గా బీజేపీ మైనారిటీ విభాగం తాజా పోస్టర్లు విడుదల చేసింది. '2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ మోత మోగిస్తుంది. మేం యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నాం' అని ఆ విభాగం పేర్కొనగా.. సమాజ్ వాది పార్టీ నేతలు గట్టి కౌంటర్ వేశారు.

తాము శాంతియుత పౌరులం అని.. అశాంతితో కూడిన మనస్తత్వం కలిగినవారే పులులపై సవారీ చేస్తారు అని మహానగర్ అధ్యక్షుడు మోసిన్ ఖాన్ చెప్పారు. కాగా, బీజేపీ చేసిన ఈ పనిపట్ల తాము నిరసన వ్యక్తం చేస్తామని, ఈ చర్య పూర్తిగా ఖండిచందగినదని ఏఐఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు సమీర్ సిద్దిఖీ అన్నారు.

మరిన్ని వార్తలు