మూక హత్యలపై యోగి సంచలన వ్యాఖ్యలు

25 Jul, 2018 18:07 IST|Sakshi
యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ (ఫైల్‌ఫోటో)

సాక్షి, లక్నో : దేశవ్యాప్తంగా మూక హత్యలు, దాడులు పెరుగుతున్న క్రమంలో బుధవారం యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ స్పందించారు. ఇలాంటి ఘటనలకు అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారని, గోవులు కూడా విలువైనవేనని వ్యాఖ్యానించారు. ఆవును స్మగ్లింగ్‌ చేస్తున్నారనే అనుమానంతో రాజస్తాన్‌లోని అల్వార్‌ సమీపంలో ఓ వ్యక్తిని కొందరు హతమార్చిన నేపథ్యంలో యోగి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మూక హత్యలపై మాట్లాడితే మరి 1984లో జరిగిందేమిటని యోగి ప్రశ్నించారు. శాంతిభద్రతల అంశం రాష్ట్ర పరిధిలోనిదని స్పష్టం చేశారు. ప్రభుత్వం పౌరులందరికీ భద్రత కల్పిస్తుందని చెప్పారు. ‘అందరి మనోభావాలను గౌరవించడం ప్రతి వ్యక్తి, మతం, వర్గం బాధ్యత..మనుషులు ఎంత ముఖ్యమో గోవులూ అంతే ముఖ్యం..ప్రకృతిలో ఇద్దరికీ వారికి నిర్ధేశించన పాత్ర ఉంది..ప్రతి ఒక్కరినీ కాపాడుకోవా’లని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ ఇలాంటి అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం పెద్దవిగా చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాగా రాజస్తాన్‌లో మూక హత్యకు సంబంధించి ఇప్పటివరకూ ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి ఓ ఏఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు