మీరట్ : చెరుకు పంటను అధికంగా పండించడం మధుమేహానికి దారితీస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ వ్యాఖ్యానించారు. రైతులు చెరుకుతో పాటు ఇతర పంటలపై దృష్టిసారించడమే దీనికి పరిష్కారమని సూచించారు. అక్టోబర్ 15 నాటికి రైతులకు చెరుకు బకాయిలను చెల్లించని చక్కెర మిల్లులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.
పేదలు, రైతులను ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. చెరుకు రైతుల బకాయిలను వచ్చే నెల 15 నాటికి చెల్లించకుంటే చక్కెర మిల్లులపై కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. ఢిల్లీ-సహరన్పూర్ జాతీయ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, యూపీలో దేశంలోనే అత్యధికంగా చెరుకు దిగుబడులు సమకూరుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 20 నుంచి నవంబర్ 5 వరకూ చెరుకు క్రషింగ్ సీజన్ కొనసాగుతుంది. కాగా దేశంలో మొత్తం చక్కెర అవసరాల్లో 38 శాతం మేరకు దాదాపు 32 మిలియన్ టన్నుల చక్కెర యూపీలోనే ఉత్పత్తవుతుంది.