సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు

29 Apr, 2017 17:32 IST|Sakshi
సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు

లక్నో: అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచీ కీలక నిర్ణయాలతో దూసుకుపోతున్న యోగి ఆధిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలతో గోరఖ్‌పూర్ లో శనివారం సమావేశమైన యోగి మాట్లాడుతూ.. 'ఈవీఎం అంటే ఎవ్రీ ఓట్ ఫర్ మోదీ' అని వ్యాఖ్యానించారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రతిపక్షాలు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేయగా, తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లోనూ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ భారీ మోజార్టీతో విజయం సాధించడంపై యోగి ఈ విధంగా స్పందించారు. ఢిల్లీ ప్రజలు తమ పార్టీ బీజేపీపై నమ్మకం ఉంచారని, అందుకే 'ఈవీఎం.. ఎవ్రీ ఓట్ మోదీ' విధానాన్ని అనుసరించారని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ దేశంలో వీఐపీల సంప్రదాయానికి అడ్డుకట్ట వేశారని కొనియాడారు. చట్టాలపై గౌరవం లేనివాళ్లు, రౌడీలు, గూండాలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోవాలని.. అది వారి మంచికోసమే తాను చెబుతున్నట్లు సీఎం యోగి పునరుద్ఘాటించారు. యూపీలో చట్టాల్లో, ప్రభుత్వ విధానాలలో ఎన్నో మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆఫీసు వేళల్లో ముఖ్యమంత్రి ఏ సమయంలో ఫోన్ చేసినా అధికారులు కచ్చితంగా స్పందించాలని లేని పక్షంలో వేటు వేస్తానని ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. శాంతిభద్రతలు, ప్రభుత్వ విధానాలపై తనకు స్పష్టమైన విజన్ ఉందని, భవిష్యత్తులోనూ ఎన్నో మార్పులకు శ్రీకారం చుడతానని గోరఖ్‌పూర్ సభలోనూ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు