టీచర్లకు విదేశీ భాషలు నేర్పించండి : యోగి

10 Feb, 2020 20:12 IST|Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని టీచర్లకు విదేశాల్లో బోధించేందుకు వీలుగా విదేశీ భాషలు నేర్పించాలని సూచించారు. అలాగే ఇటీవల నిర్వహించిన యూపీ బేసిక్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు నిర్వహించిన పరీక్షలో​ పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారని గుర్తుచేశారు. దిగ్విజయ్‌నాథ్‌ ఎల్‌టీ ట్రైనింగ్‌ కాలేజ్‌లో నిర్వహించిన సెమినార్‌లో సీఎం యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ టీచర్లకు విదేశాల్లో డిమాండ్‌ అధికంగా ఉందని చెప్పారు. దేశంలోని ఉపాధ్యాయులను విదేశాలకు పంపించే విధంగా వారి అర్హతలను పెంపొందించాలన్నారు. 

ఉత్తరప్రదేశ్‌లోని విద్యాసంస్థలు అన్నీ.. ఏయే దేశాల్లో టీచర్ల అవసరం ఉందో తెలుసుకుని అక్కడ ఏ భాషలు మాట్లాడుతారో గుర్తించాలని ఆదేశించారు. అలా గుర్తించిన భాషలను టీచర్‌ ట్రైనింగ్‌ పాఠ్యాంశాల్లో చేర్చాలని సూచించారు. బేసిక్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు నిర్వహించిన పరీక్షలో శిక్షణ పొందిన 70 శాతం మంది గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులు విఫలమయ్యారని పేర్కొన్నారు. ఇది మన విద్యా వ్యవస్థ నాణ్యతను తెలియజేస్తుందని.. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. 

మరిన్ని వార్తలు