అయోధ్య: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమిని సందర్శించారు. అయోధ్య తన వ్యక్తిగత విశ్వాసమని, దీన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయోధ్యను అభివృద్ధిచేసే బాధ్యత తనపై ఉందని తెలిపారు. ‘అయోధ్యలో దీపావళి వేడుకలు నిర్వహించడం ద్వారా నేనేం కొత్త సంప్రదాయానికి తెరతీయలేదు.
ఇది తరతరాలుగా జరుగుతున్నదే. మన పురాతన సంస్కృతిని కాపాడేందుకు నేను చేసిన ప్రయత్నమే ఇది. సమగ్రాభివృద్ధి ద్వారా అయోధ్యను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నా’ అని అన్నారు. అయోధ్యలో తన రెండో రోజు పర్యటనలో భాగంగా అంతకుముందు ఆయన హనుమాన్గడి ఆలయంలో పూజలు నిర్వహించారు.