న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముందుగా నిర్ణయించుకోకుండానే బీజేపీ చీఫ్ అమిత్షాతో ప్రత్యేక సమావేశం అయ్యారంట. ఈ విషయాన్ని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. వాస్తవానికి తన కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించనున్న నేపథ్యంలో తొలిరోజు పాలన అనంతరం యోగి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆమాత్యులను కలిసి పార్లమెంటులో ప్రసంగిస్తూ మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు.
ఈ ప్రసంగం అయిపోగానే ఆయన నేరుగా తిరిగి లక్నో వెళ్లేందుకు ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. అయితే, మార్గం మధ్యలో తిరిగి వెనక్కి తిరిగి అనూహ్యంగా అమిత్ షా వద్దకు వెళ్లారు. అయితే, అమిత్ షా వద్దకు వెళ్లే విషయం ఆయన ముందుగా నిర్ణయించుకోలేదట. అయితే, ఏ మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలనే విషయాన్ని చర్చించేందుకే యోగి అమిత్ షాతో ప్రత్యేకంగా వెనక్కి వెళ్లి మరీ కలిసినట్లు తెలిసింది. హోంశాఖ బాధ్యతలు తనకంటే తనకంటూ దినేశ్ శర్మ, కేశవ్ ప్రసాద్ మౌర్య పోటీపడుతున్నారంట. ఈ విషయాన్ని కూడా ఆయన అమిత్ షాతో చర్చించినట్లు సమాచారం.