లక్నో: మొత్తానికి ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా యోగి ఆధిత్యానాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రాష్ట్రంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బిహార్ మాదిరిగా తమ రాష్ట్రంలో కూడా మద్యాన్ని నిషేధించాలంటూ గత కొంత కాలంగా చేస్తున్న డిమాండ్కు మరింత ఊపునిచ్చేలాగా అతివలంతా ఒక్కటయ్యారు. అనూహ్యంగా మంగళవారం రాత్రికి రాత్రే పలు లిక్కర్ షాపులపై దాడులకు దిగారు. ఈ దాడుల వెనుక ఏ ఒక్క సంస్థ లేకపోవడం గమనార్హం.
లక్నో నుంచి హాపూర్, బులందేశ్వర్ నుంచి అంబేద్కర్ నగర్ వరకు ఉన్న మద్యం దుకాణాలన్నింటిపై మహిళలంతా కూడా తమకు తామే స్ఫూర్తిని పొంది దాడులు చేస్తున్నారని, రాష్ట్రంలో మధ్యం పూర్తిగా ఎత్తివేయాలన్నదే వారి డిమాండ్ అని మహిళా నిఘా సంస్థలు చెబుతున్నాయి. అయితే, కొంతమంది మాత్రం కొందరు మహిళలకు చేతులకు కొన్ని ప్రత్యేకమైన బ్యాండ్స్ ధరించి, ఓ మతపరమైన నినాదాలు చేస్తూ లిక్కర్ షాపులపై దాడులకు దిగుతున్నారని అంటున్నారు.
గత ప్రభుత్వానికి ఎన్నిమార్లు చెప్పినా పెద్దగా పట్టించుకోలేదని, అక్రమాలు, అవినీతిని ఎక్కడ, ఎప్పుడు, ఎవరు బయటపెట్టినా వెంటనే అవి జరిగే చోటుపై చర్యలు తీసుకుంటామని కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి యోగి చెప్పిన నేపథ్యంలో ఆ మహిళలు ముందుకెళుతున్నారని అంటున్నారు. లక్నోలో మాత్రమే రాత్రికి రాత్రి అలాంటివి ఏడు సంఘటనలు చోటు చేసుకున్నాయని పోలీసులు చెబుతున్నారు. కొన్ని మద్యం షాపులకు నిప్పు కూడా పెట్టారంట.