ముంగిట్లోకే పవిత్ర గంగాజలం!

30 May, 2016 20:57 IST|Sakshi
ముంగిట్లోకే పవిత్ర గంగాజలం!

న్యూఢిల్లీః కాశీ వెళ్ళి గంగలో స్నానం చేయడం అంటే జీవితం ధన్యం అయినట్లేనని ఎంతోమంది హిందువులు నమ్ముతారు. ఆ పుణ్య తీర్థ స్నానం జీవితంలో ఒక్కసారైనా చేయాలని ఆశిస్తారు. ఆ నదీ జలాలతో స్నానమాచరించాలనే కోరిక ఉన్నా, అవకాశం లేని వారికోసం ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది. గంగా జలాన్ని పోస్టు ద్వారా ఏకంగా మీ ముంగిట్లోకి తెచ్చే ప్రత్యేక సౌకర్యాన్ని ఈ కామర్స్ సహాయంతో అందించనుంది.

పవిత్ర గంగాజలం పోస్టుద్వారా నేరుగా ఇంటికే వచ్చే అవకాశం దగ్గర్లోనే ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ శాఖను వినియోగించుకొని ఈ కామర్స్ సైట్లతో అనుసంధానమై ఈ ప్రత్యేక సదుపాయాన్నిభక్తులకు ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తేనుంది. పోస్టల్ నెట్ వర్క్ ద్వారా గంగాజలం పొందే అవకాశాన్ని కల్పించమంటూ తమకు ఎన్నో విన్నపాలు అందాయని, అందుకే హరిద్వార్, రిషికేశ్ ల వద్దనుంచి శుద్ధి చేసిన గంగాజలాన్ని ఇంటింటికి చేర్చే సదుపాయం కల్పించనున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఆన్ లైన్ లో కొనుగోలు చేయడం ద్వారా గంగాజలాన్ని ఇంటికి పంపిచే ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక ప్రతిపాదనతో పోస్టల్ శాఖకు ఎనభై శాతం ఆదాయం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ళ పాలనలో సాధించిన విజయాలను వెల్లడించిన సందర్భంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఉత్తరాలతోపాటు చీరలు, ఆభరణాలు వంటి ఎన్నో వస్తువులతో కూడి పార్శిళ్ళను అందిస్తున్న పోస్ట్ మ్యాన్ లు గంగాజలం ఎందుకు అందించకూడదు అన్నారు.

స్పీడ్ పోస్ట్ రెవెన్యూ డిపార్ట్ మెంట్ 2013-14 సంవత్సరాల్లో 1,372 కోట్ల ఆదాయాన్ని చవి చూసిందని, అలాగే 2015-16 అది 1600 కోట్లకు పెరిగిందని మంత్రి వెల్లడించారు. అదే సంవత్సరాల్లో  ఈ కామర్స్ ద్వారా  క్యాష్ ఆన్ డెలివరీ కలెక్షన్లు 100 కోట్లనుంచి 1300 కోట్లకు పెరిగాయని తెలిపారు.

మరిన్ని వార్తలు