పోలీసులపై కత్తితో యువకుడి దాడి

9 May, 2020 16:16 IST|Sakshi

ముగ్గురు పోలీసుకు గాయాలు

ముంబై : పోలీసులపై దాడులు జరగడం ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారింది.  ఇటీవల పంజాబ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్‌ను అమలయ్యేలా చూస్తున్న ఓ పోలీసు అధికారి చేతిని కొందరు దుండగులు నరికేయడం తెలిసిందే. తాజాగా ముంబైలో కూడా దాదాపు అలాంటి ఘటననే చోటు చేసుకుంది. కత్తి తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావని అడ్డగించినందుకు పోలీసులపై దాడి చేశాడో 27 ఏళ్ల యువకుడు. ఈ ఘటనపై ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.

 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్‌ ముంబైలోని సిల్వర్ ఓక్స్ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన కరణ్ ప్రదీప్ నాయర్(27) శనివారం తెల్లవారుజామున 1.30 ప్రాంతంలోచేతిలో పెద్ద కత్తి పట్టుకొని చౌపట్టి నుంచి మెరైన్ డ్రైవ్ వరకు ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సమయంలో అక్కడే నైట్‌ డ్యూటీ చేస్తున్న మెరైన్ డ్రైవ్ పోలీసులు అతన్ని చూసి అడ్డగించబోయారు. దీంతో కరణ్‌ వారికి దొరకుండా పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులపై యువకుడు కత్తితో దాడి చేశాడు.ఈఘటనలో ఒక ఎస్సైతో సహా ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి.

చికిత్స నిమిత్తం ముగ్గురు పోలీసులను స్థానికి ఆస్పత్రికి తరలించి, అనంతరం మెరైన్‌ డ్రైవ్‌ పోలీసు స్టేషన్‌కి తీసుకెళ్లారు. కరోనా వైరస్‌ భయం వల్ల వారు ఆస్పత్రిలో ఉండలేకపోయారని, పోలీసు స్టేషన్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని సీనియర్‌ పోలీసులు అధికారి పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేశామని చెప్పారు.  నిందితుడు కరణ్‌ ఓ నిరుద్యోగి అని, తల్లి, చెల్లితో కలిసి కుంబాల హిల్స్‌లో నివసిస్తున్నాడని తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి తల్లితో గొడపడి, ఇంట్లో నుంచి ఓ పెద్ద కత్తి తీసుకొని ఒకరిని చంపేస్తానంటు బయటకు వచ్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు  పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు