నిన్న అమూల్య.. నేడు ఆర్ధ్ర

22 Feb, 2020 06:40 IST|Sakshi
యువతిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

ఫ్రీ కశ్మీర్‌ అంటూ వివాదాస్పద పోస్టర్‌ ప్రదర్శన

యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

కర్ణాటక, శివాజీనగర: పాకిస్తాన్‌ జిందాబాద్‌ అంటూ అమూల్య లియోనా నినాదంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి సద్దుమణుగక ముందే మరో యువతి ఫ్రీ కశ్మీర్‌ అనే కరపత్రాన్ని ప్రదర్శించి ప్రజాగ్రహానికి కారణమైంది. గురువారం ఫ్రీడం పార్కులో అమూల్య వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పలు  హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమానికి వచ్చిన ఆర్థ్రా అనే యువతి నిరసనకారుల వెనుక ప్లకార్డును పట్టుకుని నిలబడింది. ఆ ప్లకార్డు పోస్టర్‌లో ‘ముసల్మాన్, దళిత్‌ ట్రాన్జ్‌ ఆదివాసి ముక్త్‌’ అని రాసి ఉంది.  ఆ పోస్టర్‌పై ఆందోళనకారులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిందని పలువురు శ్రీరామ సేన కార్యకర్తలు ఆరోపించారు. ఈ సమయంలోయువతిపై పలువురు దూసుకెళుతుండడంతో పోలీసులు యువతిని రక్షించి ఎస్‌.జే.పార్కు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

దీనిపై వివరణ ఇచ్చిన సెంట్రల్‌ విభాగపు డీసీపీ చేతన్‌సింగ్‌ రాథోడ్, యువతి పాకిస్తాన్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేయలేదని, ఆమె చేతిలో ముక్తి కాశ్మీర్, ముక్తి ముస్లిం, ముక్త్‌ దలిత్‌ అనే ప్లకార్డు ఉంది. ఆ క్షణంలో యువతిపై దాడికి పలువురు యత్నించారన్నారు. ప్రస్తుతం ఆమె తమ అదుపులో ఉందని తెలిపారు. ఈ యువతి వెనుక ఎవరు ఉన్నారు. ఎక్కడ నుంచి వచ్చారనే విషయంపై తనిఖీ చేపడుతామని చేతన్‌ సింగ్‌ రాథోడ్‌ తెలిపారు.   గురువారం జరిగిన ఘటనపై ధర్నా నిర్వాహకులైన శ్రీరామ సేనా రాష్ట్ర కార్యదర్శి హరీశ్‌ మాట్లాడుతూ... గుర్తుతెలియని యువతి ఎక్కడినుంచి వచ్చారని, ఎందుకు వచ్చారని తెలియదు. తమ ముందు నడచుకొంటూ వచ్చి అందరిలో  చేరుకొని దేశ వ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపించారు. తాము ఆమెను విచారించే సందర్భంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఆమె మానసిక అస్వస్థతకు గురైన మహిళ అంటూ  తీసుకెళ్లారన్నారు. అయితే తాము ఇంతటితో వదలమని, శ్రీరామసేనా రాష్ట్రాధ్యక్షుడు ప్రమోద్‌ ముతాలిక్‌తో చర్చించి తదుపరి నిర్ధారణ తీసుకొంటామని తెలిపారు.  పాకిస్తాన్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేయటం సరికాదని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని  డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు