పెల్లెట్ల గాయాలతో మరో యువకుడు మృతి

17 Sep, 2016 11:31 IST|Sakshi

శ్రీనగర్ః కశ్మీర్ లోయలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. నేటికీ మృత్యుఘోష వినిపిస్తూనే ఉంది. తాజాగా పెల్లెట్ల గాయాలతో ఓ యువకుడు మరణించడం కలకలం రేపింది.

కశ్మీర్ లో ఆందోళనల పర్వం కొనసాగుతూనే ఉంది. బుర్హాన్ వని మరణం అనంతరం మొదలైన గొడవల్లో ఇప్పటిదాకా సుమారు 81 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం లోయలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఆందోళనల్లో సుమారు 40 మంది వరకూ గాయాలపాలయ్యారు. ఆందోళనల కారణంగా  జరిగిన కాల్పుల్లో పెల్లెట్ల గాయాలకు మోమిన్ అల్తాఫ్ గనై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

శ్రీనగర్ హర్వాన్ కు చెందిన మోమిన్ మృతదేహాన్ని గతరాత్రి గుర్తించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. మోమిన్ శరీరమంతా పెల్లెట్ల గాయాలున్నట్లు వారు గుర్తించారు. శుక్రవారం హర్వాన్ లో ఆందోళనకారులు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన గొడవల్లో ఈ యువకుడు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే గాయపడిన యువకుడు.. వెంటనే అక్కడినుంచి అదృశ్యమయ్యాడని, అనంతరం రాత్రి అతడి మృతదేహాన్ని తాము గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. టీనేజర్ మృతదేహం బయటపడ్డంతో కశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలతోపాటు హర్వాన్లో తిరిగి కర్ఫ్యూ విధించారు.

మరిన్ని వార్తలు