ఫ్రెండ్ అని కూడా చూడకుండా పొడిచేశాడు

4 Sep, 2016 14:56 IST|Sakshi
ఫ్రెండ్ అని కూడా చూడకుండా పొడిచేశాడు

ముంబయి: సోషల్ మీడియాలో సరదాగా సాగిన సంభాషణ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. తాము స్నేహితులం అనే విషయం కూడా మరిచి ఇద్దరు యువకులు కొట్టుకున్నారు. వాట్సాప్ గ్రూప్లో తనను అవమానించాడనే ఆగ్రహంతో మరో మిత్రుడు కత్తితో తన స్నేహితుడిని పొడిచాడు. దీంతో అతడి పొట్టలోకి ఐదు అంగుళాల మేర కత్తి దిగింది. అతడిని సమీపంలోని ఆస్పత్రిలోకి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే, ముంబయిలోని దాదార్ ప్రాంతంలో మనీశ్ షా (26) అనే యువకుడు తన తండ్రితో కలిసి తమ స్టీల్ పాలిషింగ్ కంపెనీకి వెళ్తుంటాడు.

అతడు శ్రేయాస్ నవాల్కర్(21) అనే మరో యువకుడు స్నేహితులు. నవాల్కర్ ప్రొడక్షన్ డిజైన్ స్టూడెంట్. వాళ్లు వాట్సాప్లో తొలుత సరదా సంభాషణ మొదలు పెట్టారు. అది కాస్త ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకునే వరకు వెళ్లింది. ఇంకా ముదిరి ఒకరికొకరు ఎదురుపడితే తన్నుకునే చచ్చేంత తీవ్ర స్థాయి వరకు సాగింది. సరిగ్గా మధ్యాహ్నం 3.20గంటల ప్రాంతంలో తన బైక్ పై కోపంతో బయటకు వెళ్లిన మనీశ్ షా నాజ్ సినిమా కాంపౌండ్లో నవాల్కర్ను కత్తితో పొడిచి పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనీశ్ను అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు