సాక్షి, అమరావతి: మానస సరోవరం యాత్రకు బయలుదేరి వెళ్లిన వేలాది మంది ఆంధ్రులు వరదల్లో చిక్కుకున్నారు. హిల్సా బేస్ క్యాంపులో చిక్కుకున్న యాత్రికుల గురించి వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి కావాల్సిన వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్.. యాత్రికుల విషయం తెలియగానే ఈ వ్యవహారంపై ఆరా తీశారు. పార్టీ నాయకులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హిల్సా బేస్ క్యాంపులో చిక్కుకుపోయిన యాత్రికులను సురక్షితంగా తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ ఒక ప్రకటన విడుదల చేసింది.