‘ఆయన్ను బ్రోకర్‌లా బాబు వాడుకుంటున్నారు’

27 Dec, 2018 15:37 IST|Sakshi

ఢిల్లీ: నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి తన సొంత ప్రయోజనాలు నెరవేరలేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బీజేపీని వదిలేశారని వైఎస్సార్‌సీపీ నేత సి. రామచంద్రయ్య ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ అగ్రనేతలు ఢిల్లీలో వంచనపై గర్జన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో రామచంద్రయ్య మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో భయపడి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ పారిపోయారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలను వంచించింది ముమ్మాటికీ చంద్రబాబేనని నొక్కివక్కానించి చెప్పారు. ఎన్నోసార్లు మోదీని పొగుడుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది చంద్రబాబేనని పేర్కొన్నారు.

ఏపీకి అన్యాయం చేసిన విషయంలో వెంకయ్యనాయుడు పాత్ర ఉందని అన్నారు. ఏపీకి మొదటి శత్రువు చంద్రబాబు నాయుడేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడి వల్ల ఏపీకి రూ. లక్షల కోట్ల నష్టం వచ్చిందన్నారు. పోలవరం కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి చంద్రబాబు తాకట్టు పెట్టారని అన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టుల కాంట్రాక్టులను తన అనుచరులకు ఇచ్చి చంద్రబాబు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. తెలుగు దేశం ఎంపీ సీఎం రమేష్‌ను ఒక బ్రోకర్‌లా చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వల్లే సాధ్యమవుతుందని చెప్పారు.

ప్రత్యేక హోదా అన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తల కేసు: కన్నబాబు
ప్రత్యేక హోదా కోసం పోరాడిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టించి వేధించిన చంద్రబాబు ధర్మపోరాట దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌సీపీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు. హోదాపై యూటర్న్‌ తీసుకుని హోదా నేనే తెస్తానంటూ చంద్రబాబు ప్రగల్బాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ తీసుకురాకుండా బీజేపీని చంద్రబాబు తిడుతున్నారని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీతో చంద్రబాబు కలిసిపోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోయారని గుర్తు చేశారు. ఎన్నికలైన తర్వాత చంద్రబాబు ఏంటో కాంగ్రెస్‌ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు.
 

మరిన్ని వార్తలు